జూన్ 4 తర్వాత అవినీతిపరులపై వేగంగా చర్యలు: ప్రధాని నరేంద్ర మోడీ

జూన్ 4 తర్వాత అవినీతిపరులపై చర్యలు ముమ్మరం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2014కు ముందు దేశంలో రోజుకో స్కామ్ జరిగేదని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

Update: 2024-05-28 11:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జూన్ 4 తర్వాత అవినీతిపరులపై చర్యలు ముమ్మరం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2014కు ముందు దేశంలో రోజుకో స్కామ్ జరిగేదని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక స్కామ్‌లన్నీ ఆగిపోయాయని తెలిపారు. జార్ఖండ్‌లోని దుమ్కాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో మోడీని తొలగించాలని ఈ రెండు పార్టీలూ కోరుకుంటున్నాయని తెలిపారు. ఎందుకంటే మోడీని తీసేస్తే మళ్లీ స్కామ్ లు చేసే అవకాశం దొరుకుతుందని వారు భావిస్తున్నారని విమర్శించారు. జేఎంఎం, కాంగ్రెస్‌లు జార్ఖండ్‌ను అన్ని విధాలుగా లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. మోసాలు జరగడానికి ఇక్కడి ప్రజలు అనుమతించబోరని తేల్చి చెప్పారు.

‘జేఎంఎం, కాంగ్రెస్‌ వ్యక్తుల నుంచి నోట్లకట్టలు పట్టుబడుతున్నాయి. ఈ డబ్బంతా మద్యం కుంభకోణం, కోట్ల రూపాయల టెండర్ స్కామ్, మైనింగ్ స్కామ్ నుంచి వస్తోంది’ అని వ్యాఖ్యానించారు. అంతేగాక వారు సైన్యం భూమిని కూడా లాక్కున్నారని, ఇప్పుడు పేదలు, గిరిజనుల భూమి కబ్జాకు గురవుతోందని మండిపడ్డారు. ‘ఇండియా కూటమిలోని వ్యక్తులు ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ మోడీ జీవించి ఉన్నంత కాలం గిరిజనులు, దళితుల రిజర్వేషన్లను లాక్కోలేరు’ అని తెలిపారు.

నాపై హిందూ-ముస్లిం ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఎంత బురదజల్లితే కమలం అంత వికసిస్తుందని చెప్పారు. జార్ఖండ్‌లో చొరబాటుదారుల సంక్షోభం ఉందని ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో, గిరిజనుల సంఖ్య వేగంగా తగ్గిపోయి, చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ప్రజలను లూటీ చేయడంలో కాంగ్రెస్ ముందుంటుందని తెలిపారు. పేదల జీవితాల్లో బీజేపీ ఎంతో మార్పు తెచ్చిందని కొనియాడారు. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది తల్లులు, సోదరీమణులను లఖ్‌పతి దీదీలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.

Tags:    

Similar News