Pakistan: పాక్ లో రైలు హైజాక్.. 27 మంది ఉగ్రవాదులు హతం
పాకిస్థాన్లోని బలూచిస్తాన్లో జాఫర్ రైలును హైజాక్(Train Hijack) ఘటన కలకలం రేపింది. కాగా.. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా 27 మంది ఉగ్రవాదులు హతమయ్యారు

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్లోని బలూచిస్తాన్లో జాఫర్ రైలును హైజాక్(Train Hijack) ఘటన కలకలం రేపింది. కాగా.. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా 27 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 155 మంది ప్రయాణికులను రైలు నుంచి రక్షించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. క్వెట్టా నుంచి రైలు బయలుదేరిన సమయంలో దాంట్లో సుమారు 450 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ఆపరేషన్లో 30 మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, భద్రతాబలగాల మృతి విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చివరి మిలిటెంట్ను హతమార్చే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. పంజాబ్, సింధ్ ప్రాంతాల నుంచి బలోచిస్తాన్ వెళ్లే అన్ని రైళ్లను రెస్క్యూ ఆపరేషన్ వల్ల రద్దు చేసినట్లు పాకిస్థాన్ రైల్వే శాఖ పేర్కొన్నది. కాగా.. బుధవారం ఉదయం జాఫర్ రైలు నుంచి 57 మంది ప్రయాణికుల్ని రెస్క్యూ చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు. కాపాడిన వారిలో కొందరిని క్వెట్టాకు తరలించారు. ఇక మరో 23 మంది ప్రయాణికుల్ని మాచ్కు పంపించారు.
అఫ్గాన్ లో మాస్టర్ మైండ్
ఇకపోతే, మస్కఫ్ టన్నెల్ వద్ద జాఫర్ ఎక్స్ ప్రెస్ ను ముష్కరులు అడ్డుకున్నారు. ట్రాక్ను పేల్చి.. డ్రైవర్ను షూట్ చేసి రైలును ఆపారు. ఆ తర్వాత రైలుని హైజాక్ చేశారు. భద్రతా దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాక, మిలిటెంట్లు చిన్న గ్రూపులుగా విడిపోయారని అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తులు శాటిలైట్ ఫోన్లతో అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. కొండలు, లోయ ప్రాంతాలు కావడంతో.. రైలు హైజాక్ అయిన ప్రాంతానికి వెళ్లడానికి భద్రతా దళాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. ఇకపోతే, అఫ్గానిస్థాన్ లో ఉన్న మాస్టర్ మెండ్ తో ముష్కరులు టచ్ లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అఫ్గానిస్థాన్, ఇరాన్ బోర్డర్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో రైలును ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్నారు.