కర్ణాటకలో సంచలనం.. మాజీ సీఎంపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్ప 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు రాగా, ఆయనపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే

Update: 2024-06-13 13:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్ప 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు రాగా, ఆయనపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో గురువారం బెంగళూరు ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయనను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసును ప్రస్తుతం సీఐడీ విచారిస్తుండగా, బుధవారం లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని యడ్యూరప్పకు సీఐడీ సమన్లు పంపింది. అయితే తాను ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న విచారణకు హాజరవుతానని బదులిచ్చారు. ఈ కేసుపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర ఇటీవల మాట్లాడుతూ, అవసరమైతే పోక్సో కేసులో యడ్యూరప్పను అరెస్ట్‌ చేస్తామని పేర్కొనగా, తాజాగా ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

మరోవైపు అరెస్టు భయంతో, ఇంతకుముందు గానే యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఒక కేసు విషయంలో సహాయం చేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరి 2న యడ్యూరప్పను కలిసినప్పుడు 17 ఏళ్ల తన కూతురిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, బాలిక తల్లి మార్చి 14న సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీనియర్ బీజేపీ నాయకుడిపై పోక్సో చట్టం, IPC సెక్షన్ 354A (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, యడ్యూరప్పపై అభియోగాలు మోపిన బాలిక తల్లి (54)ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో గత నెలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది. అయితే అంతకంటే ముందే సీఐడీ అధికారులు బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను రికార్డు చేశారు.


Similar News