NHRC: కోచింగ్ సెంటర్ మరణాలపై ఢిల్లీ ప్రభుత్వం, మున్సిపల్ కమిషనర్‌కు NHRC నోటీసులు

దేశరాజధాని ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-30 08:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశరాజధాని ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిని సుమోటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తాజాగా ఢిల్లీ ప్రభుత్వం, నగర పోలీసు చీఫ్‌, మున్సిపల్‌ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వివరణాత్మకంగా అందించాలని తన నోటీసుల్లో పేర్కొంది.

అలాగే, ఢిల్లీ నగరంలో నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి నడుస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు, కోచింగ్ సెంటర్‌లను పూర్తిగా తనిఖీ చేసి దాని డేటాను ఇవ్వాలని, అటువంటి సంస్థలపై పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, సంబంధిత శాఖ తీసుకున్న చర్యలతో సహా ప్రతి వివరాలను నివేదికలో పొందుపర్చాలని ఢిల్లీ చీఫ్ సెక్రటరీని NHRC కోరింది. ఈ ప్రమాదం తరువాత నీటి ఎద్దడిపై అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలు వార్తా కథనాలు వచ్చాయి. ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్, వార్తా నివేదికలోని అంశాలు సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయని పేర్కొంది. అలాగే, ఇటీవల సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఒక అభ్యర్థి నీటితో నిండిన వీధిలో నడుస్తున్న క్రమంలో కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. కమిషన్ ఈ ఘటనను కూడా విచారణ చేస్తున్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News