రెబల్స్ పై వేటు తప్పదు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ హెచ్చరిక

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెబల్స్ పై అనర్హత వేటు తప్పదని అజిత్ పవార్ వర్గాన్ని హెచ్చరించారు.

Update: 2023-07-08 10:49 GMT
NCP chief Sharad Pawar
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇచ్చిన సూచనపై శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యకర్తల ప్రేమాభిమానాలు ఉన్నంతవరకు తాను రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ‘మొరార్జీ దేశాయ్‌ ఏ వయస్సులో ప్రధాని అయ్యారో తెలుసా..? నేను ప్రధానో.. మంత్రో కావాలనుకోవడం లేదు. కానీ దేశ ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. నేనింకా వృద్ధుడిని కాలేదు’ అని అజిత్‌ కు శరద్ కౌంటర్ ఇచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ గతంలో పలికిన మాటలను ప్రస్తావిస్తూ.. ‘నేను అలసిపోను. పదవీ విరమణ చేయను. నిత్యం జ్వలిస్తూనే ఉంటాను’ అని అన్నారు.

‘నేను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని చెప్పడానికి వారు ఎవరు ? నాకు ఇప్పటికీ పనిచేసే శక్తి ఉంది’ అని శరద్ పవార్ వెల్లడించారు. కుమార్తె సుప్రియా సూలేకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని మీరు కట్టబెట్టారని అజిత్ పవార్ చేసిన ఆరోపణపై స్పందనేంటి అని మీడియా ప్రశ్నించగా.. ‘కుటుంబ విషయాలు బయట మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు’ అని శరద్ పవార్ స్పష్టం చేశారు. "అజిత్‌ పవార్‌కు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా వివిధ పదవులు దక్కాయి.. నా కుమార్తెకు ఆ పదవులను ఎప్పుడు కట్టబెట్టలేదు" అని చెప్పారు. తన కూతురికి ఆ పదవులు పొందే అవకాశం వచ్చినా దూరంగా ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో మంత్రి పదవికి అవకాశం వచ్చినప్పుడు కూడా అది వేరే వారికే ఇచ్చామని తెలిపారు. తిరుగుబాటు చేసిన నేతలందరిపైనా అనర్హత వేటు వేస్తామని శరద్ పవార్ వెల్లడించారు.

Tags:    

Similar News