Delhi Basement Deaths: ప్రమాదం కాదు హత్యే.. ఆప్ పై బీజేపీ విమర్శలు

ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు చనిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమని బీజేపీ ఆరోపించింది.

Update: 2024-07-28 07:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు చనిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా ఈ ఘటనను హత్యగా అభివర్ణించారు. ‘‘ఇది ప్రమాదం కాదు.. హత్యే.. విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఢిల్లీకి వస్తున్నారు.. కానీ అవినీతికి బాధితులుగా మారారు.. బేస్‌మెంట్‌లో లైబ్రరీని ఎలా ఏర్పాటు చేశారో ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. అయితే, ఆ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఢిల్లీ మంత్రి అతిషి ఇప్పటికీ సంఘటనా స్థలానికి చేరుకోలేదు. డ్రైనేజీని శుభ్రం చేయాలని స్థానికులు కోరుతూనే ఉన్నారు. బాధ్యులు ఎంతటివారినైనా శిక్షించాలి. ఈ దుర్ఘటనలో విద్యార్థుల తప్పేంటి?” అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ విమర్శలు

ఢిల్లీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఢిల్లీ చీఫ్ దేవేందర్ యాదవ్ అన్నారు. “ఈ సమస్యను రాజకీయం చేయదలచుకోలేదు. కానీ, ఢిల్లీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. కొన్నిచోట్ల నీళ్లు లేక, మరికొన్ని చోట్ల వరదల వల్ల... ఇలా అన్నింట్లోనూ ఫెయిల్ అయ్యింది. బేస్‌మెంట్‌లో ఇన్‌స్టిట్యూట్‌ను నడపడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దీనిపై మనం దృష్టి పెట్టాలి. కేజ్రీవాల్ తన పదవిని నిలబెట్టుకోవడానికి నిరంతరం లేఖలు రాస్తారు. కానీ, ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఏంటో మనం చూడొచ్చు. ఢిల్లీ మంత్రులు ఏం చేయలేకపోతున్నారు. ఢిల్లీ మంత్రులు ప్రభుత్వాన్ని నడపలేకపోతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపి.. పరిష్కారాలు కనుక్కోవాలి. కేవలం సానుభూతితో పని జరగదు” అని అన్నారు.

స్వాతి మలివాల్ ఏమన్నారంటే?

మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. “ ఇది ప్రకృతి విపత్తు కాదు. ఇది ఒక హత్య. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలి. ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు ఏసీ గదుల్లో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాతావరణాన్ని ఆస్వాదించాలని ఢిల్లీ మేయర్ ముందుగా ప్రజలను కోరారు. ఇదేనా ఎంజాయ్‌మెంట్‌? విద్యార్థుల్లో ఆగ్రహం అర్థమవ్వట్లేదా. వారు గత రాత్రి నుంచి ఇక్కడే కూర్చున్నారు కానీ వారిని కలవడానికి ఇంకా ఎవరూ రాలేదు” అని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, మేయర్ షెల్లీ ఒబెరాయ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.


Similar News