మోడీ తనకు తానే గొప్పగా భావించుకుంటున్నారు: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలను బీజేపీలో చేరాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.

Update: 2024-04-06 10:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలను బీజేపీలో చేరాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. శనివారం జైపూర్‌లో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘బీజేపీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్య సంస్థలు నాశనమయ్యాయి. అంతేగాక రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోంది’ అని విమర్శించారు. గత పదేళ్లలో నిరుద్యోగం, ద్రవ్యోల్బనం విపరీతంగా పెరిగిపోయినా బీజేపీ దానిని పట్టించుకోవడం లేదన్నారు. మోడీ తనకు తానే గొప్పగా భావించుకుంటూ ప్రజాస్వామ్య నిబంధలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఈ దేశ నిర్మాణం కోసం పూర్వీకులు రక్తం ధారపోశారని గుర్తు చేశారు. అనంతరం సోనియా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీలు ఇతర పార్టీ నేతలతో కలిసి జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ‘న్యాయ్ పాత్ర’ను బహిరంగంగా విడుదల చేశారు.

యువత ఆశలు అడియాశలయ్యాయి: ప్రియాంకా గాంధీ

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ..బీజేపీ పాలనలో ప్రతిపక్షాలపై దాడి జరుగుతోందని తెలిపారు. ప్రజలు వాస్తవాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. మోడీ తీసుకొచ్చిన పథకాలన్నీ పెద్ద పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగానే ఉన్నాయన్నారు. పదేళ్లలో నిరుద్యోగం తారస్థాయికి చేరిందని చెప్పారు. అగ్నిపథ్ స్కీముతో సైన్యంలో చేరాలనే యువత ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు వేయబోయే ఓట్లు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. దీనిని ‘ముస్లిం లీగ్ ముద్ర’ అని అభివర్ణించారు. 

Tags:    

Similar News