Train Incident : తప్పిన రైలు ప్రమాదం.. ఈ సారి ఏకంగా సిలిండర్ తో కుట్ర

రైళ్లను పట్టాలు తప్పించే కుట్రలు దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

Update: 2024-09-22 05:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా పలు చోట్ల రైళ్లు పట్టాలు తప్పించేలా జరుగుతున్న కుట్ర కోణాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు గత కొంత కాలంగా రైళ్లు పట్టాలు తప్పేలా రైల్వే ట్రాకులపై ప్రమాదకర వస్తువులు ఉంచుతూ హడలెత్తిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. ఆదివారం ఉదయం 5:50 గంటల సమయంలో యూపీలోని కాన్పూర్ నుంచి ప్రయాగ్ రాజ్ వైపు గూడ్స్ రైలు వెళ్తుండగా పట్టాలపై గ్యాస్ సిలిండర్ ను లోకో పైలట్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ట్రైన్ ను ఆపాడు. అనంతరం అధికారులకు సమాచారం చేరవేయడంతో అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది ట్రాక్ పై ఉన్న సిలిండర్ ను తొలగించి తనిఖీ చేశారు. అది 5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఖాళీ సిలిండర్ గా వారు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశాలిచ్చినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. రైళ్లను పట్టాలు తప్పించేలా వరుసగా జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం, అధికారులు సీరియస్ ఆదేశాలు ఇచ్చినా ఇలాంటివి ఆగకపోవడంతో రైల్వే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Similar News