Mehbooba Mufti: ఒమర్ ప్రభుత్వం కశ్మీర్ ప్రజల గాయాలను నయం చేయాలి.. మెహబూబా ముఫ్తీ
ఒమర్ నేతృత్వంలోని ప్రభుత్వం కశ్మీర్ ప్రజల గాయాలను నయం చేస్తుందని ఆశిస్తున్నట్టు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం కశ్మీర్ ప్రజల గాయాలను నయం చేస్తుందని ఆశిస్తున్నట్టు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ తెలిపారు. ఒమర్ ప్రమాణ స్వీకారానికి హాజరైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘జమ్మూ కశ్మీర్ ప్రజలు చాలా ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇక్కడి ప్రజలు 2019 అనంతరం ఎన్నో బాధలు అనుభవించారు. ప్రస్తుతం కొలువుదీరిన కొత్త ప్రభుత్వం వారి పరిస్థితిని మెరుగు పరుస్తుందని ఆశిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370ని రద్దు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ కశ్మీర్ ప్రభుత్వం తీర్మానం చేయాలన్నారు. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగం, మాదకద్రవ్యాలు, విద్యుత్, ఇతర సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. మెహబూబా కుమార్తె ఇల్తిజా ముఫ్తీ సైతం కొత్త ప్రభుత్వం కశ్మీర్ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. సీఎంగా ప్రమాణం చేసిన ఒమర్ అబ్దుల్లాకు అభినందనలు తెలిపారు.