Mallikarjun Kharge: ఈ సమస్యలపైనే మా పోరాటం.. కాంగ్రెస్ చీఫ్ సంచలన ట్వీట్

రాజ్యాంగంపై దాడి కొనసాగుతోందని, కులగణన అనేది ప్రజల డిమాండ్ అని, అగ్ని పథ్ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

Update: 2024-08-13 10:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగంపై దాడి కొనసాగుతోందని, కులగణన అనేది ప్రజల డిమాండ్ అని, అగ్ని పథ్ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది ఈ మీటింగ్ అనంతరం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు డిమాండ్లపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన.. ఎన్నికల సన్నద్ధత కోసం సంస్థాగత విషయాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై చర్చించడానికి AICC ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.

ఇందులో చర్చకు వచ్చిన అంశాల్లో సెబి, అదానీల మధ్య అనుబంధం యొక్క దిగ్భ్రాంతికరమైన వెల్లడిపై సమగ్ర దర్యాప్తు అవసరమని గుర్తించినట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్లో చిన్న పెట్టుబడిదారుల డబ్బు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని, మోడీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్‌పర్సన్ రాజీనామాను కోరాలని అన్నారు. అంతేగాక ఈ విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. హద్దులేని నిరుద్యోగం, అనియంత్రిత ద్రవ్యోల్బణం, గృహ పొదుపు క్షీణత వంటి ముఖ్యమైన సమస్యలు మా దృష్టికి వచ్చాయని, పేద, మధ్య తరగతి ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు.

అలాగే రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోందని, కుల గణన అనేది ప్రజల డిమాండ్ అని వ్యాఖ్యానించారు. మా రైతులకు ఎమ్మెస్పీకి చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. మన దేశభక్తి గల యువతపై విధించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైలు పట్టాలు తప్పడం ఆనవాయితీగా మారిందని, కోట్లాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, వాతావరణ సంబంధిత విపత్తులు, కూలిపోతున్న మౌలిక సదుపాయాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ సమస్యలపై జాతీయ ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్తామని ఖర్గే ప్రకటించారు.

Tags:    

Similar News