Harshvardhan Patil: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాక్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ (Harshvardhan Patil) శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Update: 2024-10-04 11:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ (Harshvardhan Patil) శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన మద్దతుదారులతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత హర్షవర్ధన్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. ‘నేను గత రెండు నెలలుగా ఇందాపూర్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నా. ఒక విషయం స్పష్టంగా ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు’ అని అన్నారు. కాగా, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్‌ శరద్‌ పవార్‌తో తాను సమావేశమైనట్లు వెల్లడించారు. ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తమామ భర్నేపై పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. కాగా.. అక్టోబరు 7న పూణే జిల్లాలోని ఇందాపూర్‌లో జరిగే భారీ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ)లో హర్షవర్ధన్ చేరనున్నట్లు ఆయన మద్దతుదారులు తెలిపారు.

ఇందాపూర్ నుంచి పోటీలో..

మరోవైపు ఇందాపూర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హర్షవర్ధన్ పాటిల్, ప్రస్తుతం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఛైర్మన్, కోఆపరేటివ్ బ్యారన్‌గా ఉన్నారు. ఇకపోతే, 2019 సెప్టెంబరులో కాంగ్రెస్‌ పార్టీని వీడిన ఆయన బీజేపీలో చేరారు. ఇందాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఆ స్థానం నుంచే పోటీ చేసింది. కాగా.. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్సీపీ (ఎస్పీ)లో చేరి ఆ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా పాటిల్ కుమార్తె, పూణే జిల్లా పరిషత్ మాజీ సభ్యురాలు అంకితా పాటిల్ కూడా శరద్ పవార్ వర్గంలో చేరనున్నారు.


Similar News