NITI Aayog: నీతి ఆయోగ్‌ సమావేశానికి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటున్న నేతలు

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం శనివారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరగనుంది.

Update: 2024-07-27 04:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం శనివారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా సమావేశానికి వస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఎంపీ సీఎం మోహన్ యాదవ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌కు చేరుకున్నారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ యూపీ సదన్, ఢిల్లీ నుంచి బయలుదేరారు.

అయితే ఈ సమావేశాన్ని ఇండియా కూటమి సీఎంలు బహిష్కరించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి హజరుకావడం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కూడా ఈ మీటింగ్‌కు రావడంం లేదని తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సమావేశాన్ని బహిష్కరించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దూరంగా ఉంటున్నారు.

అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం సమావేశానికి హాజరు అవుతానని తెలిపారు. ఇప్పటికే ఆమె రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సమావేశంలో ‘వికసిత్ భారత్–2047’ థీమ్‌తో​ అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌‌ను తయారు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీడీపీతో ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలనే లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలా రోడ్ మ్యాప్‌‌ రూపొందించనున్నారు.

Tags:    

Similar News