విదేశీ పర్యటనలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అందరికీ తెలుసు.. రాహుల్ పై కంగనా ఫైర్

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై బాలీవుడ్‌ నటి, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) విరుచుకుపడ్డారు.

Update: 2024-09-21 10:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై బాలీవుడ్‌ నటి, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో సిక్కు కమ్యూనిటీతో సహా చేసిన ప్రకటనలపై విమర్శలు గుప్పించారు. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. అధికారం కోసం దేశాన్ని విభజించేందుకు కూడా ఆయన వెనుకాడరని ఫైర్ అయ్యారు. ‘ దేశంపై ఆయనకు ఉన్న భావన కూడా తెలుసు. అధికారంలోకి రావడానికి దేశాన్ని విభజించడానికి కూడా ఆయన వెనుకాడరు’ అని కంగనా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కంగన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఎనర్జెన్సీ మూవీ గురించి..

‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రానికి సెన్సార్‌ ఆలస్యం కావడంపైన కంగనా స్పందించారు. ‘‘ఈ చిత్రాన్ని ఎలా చిత్రీకరించానో నాకు తెలుసు. చిత్రపరిశ్రమ నుంచి నాకు ఎలాంటి సపోర్ట్‌ లేదు. ఇదో భారీ బడ్జెట్‌ మూవీ. జీ, కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో దీన్ని నిర్మించాను. సినిమా రిలీజ్‌ ఆలస్యమవుతున్నకొద్దీ మేం నష్టాలు ఎదుర్కొంటున్నాం. మా సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్‌పై ఉంది’’ అని ఆమె చెప్పారు. మరోవైపు, ఈ సినిమా విడుదల చేయవద్దని శిరోమణి అకాలీదళ్‌ (SAD) పార్టీ కూడా సెన్సార్‌ బోర్డును కోరింది. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి ప్రేక్షకుల్లో ద్వేషాన్ని పెంపొందింపజేసేలా ఈ చిత్రం ఉందని లేఖ రాసింది. దీంతో, కంగనా సహీ జీ ఎంటర్ టైన్ మెంట్స్ బాంబే హైకోర్టుని ఆశ్రయించగా.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో స్పష్టమైన నిర్ణయానికి రావాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ సర్టిఫికేషన్‌ హైకోర్టు ఆదేశించింది.

రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

ఇటీవలే రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఇండియన్ కమ్యూనిటీలతో ఆయన భేటీ అయ్యారు. ఆ టైంలో భారత్‌, ప్రధాని మోడీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత్‌లో మత స్వేచ్ఛ గురించి ఆయన మాట్లాడారు. ‘భారతదేశంలో ఒక సిక్కు తలపాగా ధరించడానికి లేదా కడా ధరించడానికి అనుమతిస్తారా? సిక్కుగా గురుద్వారాకు వెళ్లగలరా? అన్న దానిపై పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటం ఒక్క సిక్కుల కోసమే కాదు అన్ని మతాల కోసం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.

Tags:    

Similar News