JaiShankar: పొరుగు దేశాలతో సంబంధాల నిర్వహణ భారత్‌కు అంత ‘సులభం కాదు’: జైశంకర్

పొరుగు దేశాల్లో రాజకీయంగా ఎత్తుపల్లాలు సర్వసాధారణం. ఈ వాస్తవాలను అంగీకరించాలి.

Update: 2024-08-02 18:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగు దేశాలతో భారత్ తన సంబంధాలను నిర్వహించడమనేది చాలా క్లిష్టమైన వ్యవహారమని దేశ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అందుకు చారిత్రాత్మక సందర్భాలు, దేశాల పరిమాణం, సామాజిక వ్యత్యాసాలు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. 'మన చరిత్రను బట్టి, పొరుగువారి పరిమాణాన్ని బట్టి, మనదేశ-పొరుగుదేశాల సామాజిక అంశాల కారణంగా సంబంధాలను కలిగి ఉండటం అంత సులభమైన విషయం కాదని గుర్తించామని' తెలిపారు. 'పొరుగు దేశాల్లో రాజకీయంగా ఎత్తుపల్లాలు సర్వసాధారణం. భారత్ గురించి మనోభాగాలను రెచ్చగొట్టడం సులభమైన మార్గం. ఈ వాస్తవాలను అంగీకరించాలి. అయితే, భారత్‌కు ఎక్కువ వనరులు, సామర్థ్యం ఉండటం సానుకూలం అంశం. భౌగోళికంగా మధ్యలో ఉన్నామని' జైశంకర్ వెల్లడించారు. భారత్‌లో పవర్‌గ్రిడ్‌లు, పవర్ ప్లాంట్లు ఉన్నాయి. విద్యుత్ ఎగుమతులు-దిగుమతులను నిర్వహిస్తున్నాం. భారత్‌లో ఇంధన పైప్‌లైన్‌లు, రోడ్లు, రైలు, జలమార్గాల కనెక్షన్లు ఉన్నాయి. రాజకీయ వైరుధ్యాలకు విరుద్ధంగా సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాం. కొన్ని పొరుగు దేశాల్లో భారత్ ఒక రాజకీయ సమస్యగా మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే, సమర్థవంతమైన చర్యల ద్వారా తీవ్రమైన పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొంటున్నామని జైశంకర్ వివరించారు. 

Tags:    

Similar News