IIT Guhawati: ఐఐటీ గౌహతిలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది మూడవ ఘటన

విషయం తెలుసుకున్న కాలేజీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు

Update: 2024-08-09 16:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గౌహతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న ఓ విద్యార్థిని శుక్రవారం తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లో ఇది మూడో 'అసహజ మరణం'. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ఎంటెక్ విద్యార్థిని, క్లాసులకు గైర్హాజరు అవడాన్ని ఆమె స్నేహితులు గమనించారు. ఆ తర్వాత కాలేజీలో దిసాంగ్ హాస్టల్‌కు వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకుని ఉండటం గమనించారు. విషయం తెలుసుకున్న కాలేజీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అలాగే, విద్యార్థి కుటుంబసభ్యులకు సమాచారం తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, దీనికి సంబంధించి కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో సైతం ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. అంతకుముందు జనవరిలోనూ నాలుగో సంవత్సరం చదువుతున్న బీటెక్ విద్యార్థి న్యూ ఇయర్ పార్టీ తర్వాత అపస్మారక స్థితిలో ఆసుపత్రికి చేర్చారు. చికిత్స పొందుతూ విద్యార్థిని చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. 

Tags:    

Similar News