Health Ministry: 156 ఔషధాలను నిషేధించిన ప్రభుత్వం

ప్రభుత్వం 156 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్‌డీసీ) ఔషధాలను నిషేధిస్తూ గురువారం నిర్ణయించింది.

Update: 2024-08-22 15:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యానికి ప్రమాదకారిగా భావించి ప్రభుత్వం 156 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్‌డీసీ) ఔషధాలను నిషేధిస్తూ గురువారం నిర్ణయించింది. నిర్దేశించిన ఔషధాల తయారీ, అమ్మకం, పంపిణీని తక్షణం నిషేధిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంకేషమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నిషేధం విధించిన ఔషధాలలో యాంటీబయాటిక్స్, యాంటీ-అలెర్జిక్స్, పెయిన్ కిల్లర్స్, మల్టీ విటమిన్, జ్వరం, హైపర్ టెన్షన్ వంటి పలు ఔషధాల కలయికతో తయారైన మందులున్నాయి. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ), కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. నిషేధించిన ఎఫ్‌డీసీలలో ఉండే పదార్థాలకు వైద్యపరమైన నిరూపన లేదని కమిటీ సిఫార్సు చేసింది. గతేడాది సైతం ప్రభుత్వం 14 ఎఫ్‌డీసీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కొన్ని నిర్దిష్ట మందులను ఎఫ్‌డీసీ జాబితాలో చేరుస్తారు. వీటిని పలు రకాల ఔషధాల కలయిక ద్వారా తయారు చేయడం జరుగుతుంది. అయితే, డీటీఏబీ ప్రకారం నిషేధించిన ఔషధాల కలయిక వద్ద రోగులకు ప్రయోజనాలు తక్కువగా ఉండటమే కాకుండా నష్టం ఉంటుందని నిర్ధారించింది. దీంతో ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటి ఉత్పత్తి, అమ్మకం, పంపిణీని నిసేధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

Tags:    

Similar News