గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితులకు గ్రాండ్ వెల్కమ్

గౌరీ లంకేశ్ హత్య నిందితులకు కర్ణాటకలోని ఓ ప్రో హిందూత్వ గ్రూపు నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. బెయిల్ పై విడుదలైన ఇద్దరు నిందితులు పరశురాం వాగ్మోర్, మనోహర్‌ యాదవ్‌లకు పూలమాలలు, శాలువాలు కప్పి స్వాగతించారు.

Update: 2024-10-13 12:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ జర్నలిస్టు, వామపక్ష మేధావి గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితులు బెయిల్ పై విడుదలవ్వగా.. ఓ హిందూత్వ సంఘం వారిని పూలమాలలు, శాలువాలలతో సత్కరించింది. ఇద్దరు నిందితులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. కర్ణాటకలోని విజయపురలో వారికి ఈ సత్కార కార్యక్రమం జరిగింది. బెంగళూరులో 2017 సెప్టెంబర్ 5వ తేదీన గౌరీ లంకేశ్ నివాసానికి ముగ్గురు నిందితులు బైక్ పై వచ్చి తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు పరశురాం వాగ్మోర్, మనోహర్ యాదవ్‌లు ఆరు సంవత్సరాలు జైలులో గడిపారు. స్పెషల్ కోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో అక్టోబర్ 11వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చారు.

వారి స్వస్థలం విజయపురకు రాగానే.. ప్రో హిందూత్వ గ్రూపు ఒకటి వారిని అభినందించింది. పూల మాలలు, శాలువాలు కప్పి నినాదాలు ఇస్తూ వారి విడుదలను వేడుక చేసుకుంది. వారిని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు తీసుకెళ్లారు, ఆ తర్వాత కాళికా మాత ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేశారు.

హిందూత్వ అనుకూల గ్రూపు నేత మాట్లాడుతూ.. ‘ఈ రోజు విజయదశమి. మాకు చాలా ముఖ్యమైన రోజు. గౌరీ లంకేశ్ కేసులో ఇరికించి తప్పుగా ఆరు సంవత్సరాలు జైలు శిక్షకు గురైన పరశురాం, మనోహర్‌లకు సాదరస్వాగతం పలికాం. వీళ్లు హిందూత్వ సంఘ సభ్యులు అనే ఏకైక కారణంతోనే టార్గెట్ చేసుకుని అరెస్టు చేశారు. వారి కుటుంబాలు ఎంతో వేదనకు గురయ్యాయి. ఈ అన్యాయంపై ఆత్మచింతన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని పేర్కొన్నారు. పరశురాం, మనోహర్‌లతోపాటు అమోల్ కాలే, రాజేశ్ డీ బంగేరా, వాసుదేవ్ సూర్యవంశి, రుషికేశ్ దేవదేకర్, గణేష్ మిస్కిన్, అమిత్ రామచంద్ర బడ్డిలకూ అక్టోబర్ 9వ తేదీన బెయిల్ లభించింది.

Tags:    

Similar News