ఫిబ్రవరి 14 బ్లాక్ డే.. పుల్వామా ఉగ్రదాడికి ఆరేళ్లు
ఫిబ్రవరి 14.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకుంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 14.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, భారత్కు మాత్రం బ్లాక్ డే. 2019లో ఇదే రోజున జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగి నేటికి ఆరేళ్లు.
2019 ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పుర (అవంతిపురా సమీపం)లో బస్సులో ప్రయాణిస్తున్న సైనికులపై ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. దాదాపుగా 2500 మంది సైనికులతో 78 బస్సులు వెళ్తున్న సమయంలో 5వ బస్సుపై ఈ దాడి జరిగింది. దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. ఈ ప్రమాదంలో బస్సు తునాతునకలైంది. జవాన్ల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఈ దాడి తర్వాత అక్కడే దాక్కున్న ఉగ్రవాదులు సైనికులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే దాడి నుంచి తేరుకున్న జవాన్లు ప్రతిదాడి చేశారు. ఈ ఘటన జరిగిన 12 రోజులు తర్వాత, అంటే ఫిబ్రవరి 25, 2019లో భారత వైమానిక దళం పాకిస్తాన్ బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పుల్వామా దాడిలో పేలుడు పదార్థాలు నిండిన కారును నడిపిన వ్యక్తిని 22 ఏళ్ల ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్గా గుర్తించారు. ఘటనకు రెండేళ్ల క్రితమే అతను జైషే మహ్మద్లో చేరాడు. ఆత్మాహుతి బంబార్ ఆదిల్ అహ్మద్ దార్ని పోలీసులు వివిధ కేసుల్లో 6 సార్లు అదుపులోకి తీసుకున్నారు. ప్రతీసారి హెచ్చరించి వదిలేశారు.