యమునా నదిలో విషంపై అధారాలు ఇవ్వండి
దేశ రాజధానికి సరఫరా అయ్యే నీటిలో విషం కలపడం వల్ల ఢిల్లీ జల్ బోర్డు ఇంజనీర్లు నీటి శుద్దిని నిలిపేయాల్సి వచ్చిందని.. ఇది న్యూక్లియర్, బయాలాజికల్ ఆయుధాలను ఉపయోగించడంతో సమానం అని కేజ్రివాల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

- కేజ్రివాల్కు ఎన్నికల సంఘం నోటీసు
- హర్యానా ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన ఆప్ కన్వీనర్
దిశ, నేషనల్ బ్యూరో:
ఢిల్లీ ప్రజలు దాహంతో అల్లాడిపోవాలనే అక్కసుతో హర్యానా ప్రభుత్వం యమునా నీటిని కలుషితం చేస్తోందని, ఆ నీటిలో విషం కలుపుతోందని ఆప్ జాతీయ కన్వీనర్,మాజీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో ఢిల్లీకి సరఫరా అయ్యే నీటిని హర్యానా కలుషితం చేస్తోందన్న ఆరోపణలపై తగిన ఆధారాలు ఇవ్వాలని మంగళవారం కేజ్రివాల్కు నోటీసులు జారీ చేసింది. మీరు చేసిన ఆరోపణలకు సంబంధించి వాస్తవమైన, చట్టపరమైన ఎవిడెన్సులను బుధవారం రాత్రి 8 గంటల లోపు సమర్పించాలని కేజ్రివాల్ను ఆదేశించింది. దేశ రాజధానికి సరఫరా అయ్యే నీటిలో విషం కలపడం వల్ల ఢిల్లీ జల్ బోర్డు ఇంజనీర్లు నీటి శుద్దిని నిలిపేయాల్సి వచ్చిందని.. ఇది న్యూక్లియర్, బయాలాజికల్ ఆయుధాలను ఉపయోగించడంతో సమానం అని కేజ్రివాల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీటిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తగిన చర్యలు తీసుకోవాలని, ఇది మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకే వస్తుందంటూ ఈసీఐకి ఫిర్యాదు చేశాయి.