వర్షాల కారణంగా దేశ రాజధానిలో రూ.90కి చేరిన కిలో టమాటా

రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2024-07-10 08:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో టమాటా ధర కిలోకు రూ.90 కి పెరిగింది. ఆజాద్‌పూర్ మండి, ఘాజీపూర్ మండి, ఓఖ్లా సబ్జీ మండితో సహా ఢిల్లీలోని ప్రధాన హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లలో టమాటాల ధరలు భారీగా పెరిగాయి. వర్షాల వలన సరఫరా కొరత ఏర్పడి ధరలు పెరిగినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

టమాటాలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండలేవు, అవి చాలా త్వరగా కుళ్లిపోతాయి. వర్షం కారణంగా సరఫరాపై ప్రభావం పడిందని, దీంతో ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం వరకు కూడా కిలో టమాటా రూ.20 వరకు ఉండగా, ఇప్పుడు అమాంతం ఒక్కసారిగా రూ.90కి చేరడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఒక్క టమాటా అనే కాకుండా మిగతా కూరగాయల ధరలు సైతం ఆకాశన్నంటేలా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. అధిక వర్షాల ప్రభావంతో పంటల ఉత్పత్తి పడిపోయి ధరలు పెరగడానికి కారణం అయిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ వంటి రాష్ట్రాల నుండి ఈ వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడానికి ఉపయోగించే ట్రక్కుల సంఖ్య తగ్గింది. అలాగే అధిక వర్షాలతో వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం పడింది.

Tags:    

Similar News