Indigo: డ్రైవర్ నిద్రమత్తు.. ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిన టెంపో
ఆగి ఉన్న విమానాన్ని ట్రావెలర్ టెంపో ఢీకొట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో (Kempegowda Airport) చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆగి ఉన్న విమానాన్ని ట్రావెలర్ టెంపో ఢీకొట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో (Kempegowda Airport) చోటుచేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఎయిర్పోర్టులో ఆగి ఉన్న ఇండిగో విమానాన్ని (IndiGo aircraft) ఆకాశ ఎయిర్ (Akasa Air) సిబ్బంది టెంపో ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడని, ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. సిబ్బందిని వారి కార్యాలయం నుంచి ఎయిర్క్రాఫ్ట్ బే వద్దకు తీసుకురావడానికి వినియోగిస్తున్నారని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు
ఈ ప్రమాదం వల్ల పలు విమాన సర్వీసుల్లో స్వల్ప అంతరాయం కలిగింది. ఆ తర్వాత వాటిని పునరుద్ధరించారు. ఇక ఈ ఘటనపై ఇండిగో స్పందిస్తూ.. బెంగళూరు ఎయిర్పోర్టులో ఆగి ఉన్న విమానాన్ని టెంపో ఢీకొట్టడంపై తమకు సమాచారం అందిందని ఈ విషయంపై జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు సమాచారం వెల్లడించినట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఈ విషయంపై ఎయిర్లైన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని చెప్పింది.