కాంగ్రెస్ 50 సీట్లు కూడా గెలవదు: ప్రధాని నరేంద్ర మోడీ

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 స్థానాలు కూడా గెలవదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని తెలిపారు.

Update: 2024-05-11 07:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 స్థానాలు కూడా గెలవదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని తెలిపారు. ఒడిశాలోని కందమాల్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో చేపట్టిన పోఖ్రాన్ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచాయన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం ద్వారా 500 ఏళ్ల ప్రజల నిరీక్షణకు బీజేపీ ప్రభుత్వం తెరదించిందని తెలిపారు. ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఒడియా భాష, సంస్కృతిని అర్థం చేసుకున్న వారినే సీఎంను చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్‌ను గౌరవించండి అని చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. ఆర్థిక సమస్యల కారణంగా భారత్‌కు దూరమైన పొరుగు దేశం తన అణ్వాయుధాలను విక్రయించాలని చూస్తోందని తెలిపారు. పాకిస్తాన్ అణు బాంబులతో దేశ ప్రజలను భయపెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘పాక్‌లో అణుబాంబులు ఉన్నాయని కాంగ్రెస్ చెబుతోంది. కానీ ఆ బాంబును ఎలా నిర్వహించాలో కూడా తెలియని పరిస్థితిలో పాక్ ఉంది. తమ బాంబులను అమ్మడానికి వారు ప్రయత్నిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలహీనమైన వైఖరి కారణంగా జమ్మూ కశ్మీర్ ప్రజలు ఆరు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని భరించవలసి వచ్చిందని ఆరోపించారు.

Tags:    

Similar News