Subhas Chandra Bose :మరోసారి తెరపైకి నేతాజీ డెత్ మిస్టరీ.. వాటిని వెనక్కి తెప్పించాలని మోడీకి బోస్ మనవడి లేఖ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ మరోసారి చర్చగా మారింది.

Update: 2024-07-28 11:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికల విషయంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. నేతాజీ అస్థికలు భారత్ కు తెప్పించాలని నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఆగస్టు 18 లోపు జపాన్ రాజధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉంచిన నేతాజీ అస్థికలను తెప్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మేరకు ప్రధానికి లేఖను రాశారు. నేతాజీ మరణంపై దాదాపు 10 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు జరిపిన విచారణలో ఆయన తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో 18 ఆగస్టు 1945న మరణించినట్టు స్పష్టం అవుతున్నది. ఈ నేపథ్యంలో నేతాజీ మరణంపై తప్పుడు కథనాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ప్రకటన రావాల్సి ఉందని పేర్కొన్నారు. నేతాజీ అస్థికలను రెంకోజీ ఆలయంలో ఉంచడం చాలా అవమానకరమని బోస్ అన్నారు. భారత విమోచకుడిని గౌరవించాలంటే, అతని అవశేషాలు భారత నేలను తాకాలని మేము గత మూడున్నరేళ్లుగా ప్రధానమంత్రికి లేఖలు రాస్తున్నామన్నారు. నేతాజీ కుమార్తె అనితా బోస్ హిందూ సంప్రదాయం ప్రకారం సుభాష్ చంద్రబోస్ అస్థికలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కోరుకుంటున్నారని బోస్ తెలిపారు.

తండ్రి అస్తికల కోసం బోస్ కుమార్తే..

నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్ కు తీసుకువచ్చే విషయంలో ఆయన కుమార్తె అనిత బోస్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. జపాన్ లో నేతాజీగా చెప్పబడుతున్న అస్థికలకు డీఎన్ఏ నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించిదని ఆమె గతంలోనే గుర్తు చేసారు. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడులకును ఘనంగా నిర్వహించుకుంటున్న టైమ్ లోనే తన తండ్రి అస్థికలను రప్పించాలని కోరారు. ఆ అస్థికలకు అధునాతన సాంకేతికతతో విశ్లేషించడం ద్వారా బోస్ మృతిపై ఇప్పటికీ కొందరికి ఉన్న అనుమానాలకు సమాధానం ఇవ్వవొచ్చని వాదిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బోస్ మనవడు తాజాగా మోడీకి లేఖ రాయడం ఆసక్తిగా మారింది. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

Tags:    

Similar News