Kolkata: మాజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌ ఇళ్లు, ఆస్తులపై సీబీఐ దాడులు

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్‌ సందీప్ ఘోష్, అతని బంధువులకు సంబంధించిన పలు ప్రదేశాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం సోదాలు నిర్వహించింది

Update: 2024-08-25 05:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్‌ సందీప్ ఘోష్, అతని బంధువులకు సంబంధించిన పలు ప్రదేశాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం సోదాలు నిర్వహించింది. మొత్తం 15 చోట్ల సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు. అలాగే, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ డెమోనిస్ట్రేటర్ డాక్టర్ దేబాశిష్ సోమ్ నివాసంలో కూడా బృందం విచారణ చేపట్టింది.

ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిలో ట్రెయినీ డాక్టర్‌ హత్యాచారానికి గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇక్కడే పనిచేసిన ఘోష్ ‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు నమోదు చేసింది. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయగా, ఆదివారం ఘోష్‌‌తో పాటు సంబంధికుల ఇళ్లు, ఆస్తులపై దాడులు చేపట్టింది.

క్లెయిమ్ చేయని మృతదేహాల అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలతో పాటు ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, బంగ్లాదేశ్‌కు బయోమెడికల్ వ్యర్థాలు, వైద్య సామాగ్రిని రవాణా చేశారని ఘోష్‌‌పై ఆరోపణలు చేస్తూ ఈ కేసును సెంట్రల్ ఎజెన్సీకి బదిలీ చేయాలని ఆర్‌జీ కర్ ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కేసును సీబీఐకి అందించింది. దర్యాప్తు పురోగతిని సెప్టెంబర్ 17న సమర్పించేందుకు హైకోర్టు సీబీఐకి మూడు వారాల గడువు ఇచ్చింది.


Similar News