దేశంలో ఏటా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. లోక్ సభలో కేంద్రం వెల్లడి

క్యాన్సర్ కేసుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం కీలక వివారాలు వెల్లడించింది.

Update: 2024-07-26 09:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఏటా క్యాన్సర్ కేసులు 2.5 శాతం పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. పురుషుల్లో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన.. ప్రతి ఏటా 15.5 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని వెల్లడించారు. అయితే క్యాన్సర్ కోసం వినియోగించే మందుల ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నదని దీని వల్ల రోగులకు దాదాపు రూ.294 కోట్లు ఆదా ఆయ్యాయన్నారు. తమ ప్రభుత్వం క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకురావడానికి మరింతగా ప్రయత్నిస్తుందని చెప్పారు. సరసమైన సమర్థవంతమైన ఔషధాలను ఉత్పత్తి చేయడంలో భారతదేశం పాత్రను ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. భారతదేశం ప్రపంచంలోనే డిస్పెన్సరీలుగా మారిందని, దేశంలో ఔషధ పరిశ్రమలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని అన్నారు. రివాంప్డ్ ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ కింద ప్రభుత్వం ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు మద్దతు ఇస్తోందన్నారు.

ఇక హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు నడ్డా స్పందిస్తూ.. ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని ఎక్కువ మంది వైద్యులు ఉండేలా మెడికల్ కాలేజీల విస్తరణ జరుగుతోందన్నారు. 2014లో మెడికల్ కాలేజీల సంఖ్య 387 నుంచి ప్రస్తుతం 731 కి పెరిగిందని, అదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 సీట్ల నుంచి 1,12,112 (1.12 లక్షలు)కి పెరిగిందని నడ్డా సభకు తెలియజేశారు. వైద్య విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 2014లో 31,185 ఉండగా ప్రస్తుతం 72,627కు పెరిగాయని ఆయన తెలిపారు.

Tags:    

Similar News