ఎయిర్పోర్ట్లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్..
కేరళలోని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెట్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు కలకలం రేగింది.
కొచ్చి: కేరళలోని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెట్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు కలకలం రేగింది. కొచ్చి నుంచి బెంగళూరుకు వెళ్లే ఇండిగో విమానం (6E6482)లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి.. విమానాశ్రయంలోని సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్కి ఇంటర్నెట్ కాల్ చేసి బెదిరించాడు. దీంతో ఇంకాసేపట్లో టేకాఫ్ కావడానికి రెడీగా ఉన్న విమానాన్ని ఆపేశారు. అందులోని ఓ శిశువు సహా 139 మంది ప్రయాణికులను కిందికి దింపేశారు.
సీఐఎస్ఎఫ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లు, బాంబ్ స్వ్కాడ్, కేరళ పోలీసులు రంగంలోకి దిగి.. ప్రయాణికులందరి బ్యాగులను చెక్ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు దొరకలేదు. దీంతో సాయంత్రం 2.24 ప్రాంతంలో విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమతించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితుడు ఇంటర్నెట్ కాల్ చేయడంతో అది ఏ ఐపీ నుంచి వచ్చిందన్న దానిని గుర్తించే పనిలో ఉన్నారు.