Bhagwat: హిందూ సమాజంలో కుల భేదాలను అంతం చేయాలి.. మోహన్ భగవత్ పిలుపు
హిందూ సమాజంలో కుల భేదాలను అంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: హిందూ సమాజంలో కుల భేదాలను అంతం చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rss) చీఫ్ మోహన్ భగవత్ (Mohan bhagawath) పిలుపునిచ్చారు. హిందూ సమాజ సభ్యులందరూ ‘ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశానవాటిక’ అనే సూత్రాన్ని స్వీకరించి సామాజిక సామరస్యం కోసం కృషి చేయాలని సూచించారు. అలీఘర్ పర్యటనలో ఉన్న మోహన్ భగవత్ ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించారు. శాంతిని పెంపొందించడంలో భారత్ తన ప్రపంచ పాత్రను గ్రహించాలంటే సామాజిక ఐక్యత అవసరమని నొక్కి చెప్పారు. హిందూ సమాజానికి పునాది ఆచారాలు, విలువలేనని స్పష్టం చేశారు. సంప్రదాయం, సాంస్కృతిక విలువలు, నైతిక సూత్రాలపై ఆధారపడే సమాజాన్ని నిర్మించాలని ఆర్ఎస్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జాతీయవాదం, సామాజిక ఐక్యత పునాదులను బలోపేతం చేయడానికి పండుగలను సామూహికంగా జరుపుకోవాలని చెప్పారు.