ఒడిశాలో ఆడపిల్లలకు ఏదీ రక్షణ? 572 మంది గిరిజన బాలికలు, మహిళలపై లైంగిక దాడులు!

భారత్ లో రోజురోజుకూ లైంగిక దాడి ఘటనలు వెలుగులోకి వస్తున్న తీరు చూస్తుంటే.. మహిళలు, ఆడపిల్లల రక్షణ అత్యంత ప్రమాదంలో ఉందని అనిపిస్తోంది.

Update: 2024-09-07 05:23 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో రోజురోజుకూ లైంగిక దాడి ఘటనలు వెలుగులోకి వస్తున్న తీరు చూస్తుంటే.. మహిళలు, ఆడపిల్లల రక్షణ అత్యంత ప్రమాదంలో ఉందని అనిపిస్తోంది. ఒడిశాలో గిరిజన బాలికలకు భద్రత కరువైందని.. ఆ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ది శాఖ మంత్రి నిత్యానంద్ గోండ్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఒడిశా రాష్ట్ర శాసనసభ సాక్షిగా మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో 572 మంది గిరిజన బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరిగినట్లు మంత్రి తెలిపారు. ఒడిశా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ అడిగిన ప్రశ్నకు గానూ.. రాష్ట్రంలో 572 మంది గిరిజన బాలికలు లైంగిక దాడికి గురయ్యారని మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అయితే ఈ కేసులు ఇప్పటికీ కోర్టు పరిధిలోనే ఉండగా.. మొత్తం కేసుల్లో 32 కేసులకు సంబంధించి విచారణ పూర్తి కాగా, మరో 31 కేసుల్లో విచారణ కొనసాగుతోందని.. ఇంకా మిగిలిన 509 కేసుల్లో చార్జి షీట్లు దాఖలైనట్లు మంత్రి నిత్యానంద్ గోండ్ తెలిపారు.

కాగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం.. భారత్ లో ప్రతి ఏటా 4 లక్షలకు పైగా నేరాలు నమోదవుతున్నాయి. ఈ నేరాలలో ఒక లైంగిక దాడులే కాకుండా.. యాసిడ్ దాడులు, వరకట్న వేధింపుల మరణాలు, మానవ అక్రమ రవాణా వంటి నేరాలు కూడా ఉన్నాయి.


Similar News