wall collapse: మధ్యప్రదేశ్‌లో గోడ కూలి 9 మంది పిల్లలు మృతి

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-08-04 07:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాగర్ జిల్లాలోని షాపూర్‌లో ఆదివారం ఉదయం 8:30 గంటలకు హర్దౌల్ బాబా ఆలయంలో గోడ కూలడంతో 9 మంది పిల్లలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో శిధిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఆలయ గోడ 50 ఏళ్ల నాటిది. ఘటన జరిగిన సమయంలో సావన్ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో మట్టితో శివలింగాలను తయారు చేస్తున్నారు. ఒక్కసారి గోడ కూలి వారిపై పడింది. చిన్నారులు 10-15 ఏళ్ల మధ్య వయస్కులేనని జిల్లా అధికారులు తెలిపారు.

ఘటన అనంతరం స్థానికుల సహకారంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గోడ కింద నుండి పిల్లలను బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చాలా మంది పిల్లలు మరణించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందిస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే, ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ. 4 లక్షల సాయం అందజేస్తుందని ప్రకటించారు. శనివారం రేవా జిల్లాలో గోడ కూలిన ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందిన ఒక రోజు తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

Tags:    

Similar News