MEA: అమెరికా నుంచి 682 మంది భారతీయుల బహిష్కరణ
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అక్రమవలసదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అక్రమవలసదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. అలా జనవరి నుంచి 682 మంది భారతీయులు బహిష్కరణ (deportation)కు గురయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ పార్లమెంట్లో వెల్లడించారు. సరైన పత్రాలు లేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న భారతీయులకు మద్దతుగా తీసుకుంటున్న చర్యల గురించి ఆయన మాట్లాడారు. ‘‘బహిష్కరణకు గురైన వారందరిలో చాలామంది చట్టవిరుద్ధంగానే అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించారు. కానీ వారిని అమెరికా సరిహద్దులోనే అరెస్టు చేసి, వెరిఫికేషన్ తర్వాత భారత్కు తిరిగి పంపారు. అయితే దీనివల్ల విదేశాల నుంచి భారతీయులు పంపే డబ్బుపై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని కీర్తివర్దన్ వెల్లడించారు. ఇకపోతే, అక్రమ వలసలకు గల కారణాలపై చర్యలు తీసుకుంటున్నామని కీర్తివర్దన్ సింగ్ తెలిపారు. ఏజెంట్లు, మానవ అక్రమ రవాణా సిండికేట్లపై దర్యాప్తులు చేపట్టామన్నారు. డంకీ మార్గాల వల్లే వలసలు జరుగుతున్నాయన్నారు.