Johnny Master: జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్.. ఆయన భార్య సంచలన ఆరోపణలు

తోటి డ్యాన్సర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ (Johnny Master)పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-09-28 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: తోటి డ్యాన్సర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ (Johnny Master)పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసులో విచారణను కొనసాగించేందుకు నాలుగు రోజుల పాటు జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఇటీవలే కోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు కూడా అనుమతించింది. ఈ మేరకు గత నాలుగు రోజుల నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్‌ (Narsingi Police Station)లోనే జానీ మాస్టర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిర్యాదు చేసిన యువతి తన భర్త జానీని ట్రాప్ చేసిందంటూ ఆమె భార్య సుమలత, పిల్లలు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ (Film Chamber of Commerce)లో శనివారం ఉదయం ఫిర్యాదు చేశారు.

ప్రేమ పేరుతో ఆ అమ్మాయి అనుక్షణం వేధింపులకు గురి చేసిందని పేర్కొన్నారు. ఐదేళ్లు నరకం అంటే ఏమిటో జానీ మాస్టర్‌తో పాటు తనకు కూడా చూపించిందని సుమలత సంచలన ఆరోపణలు చేసింది. చివరకు ఆమె భాధ తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యకు యత్నించానని వెల్లడించింది. అత్యాచారం చేశాడని ఫిర్యాదు ఇచ్చిన అమ్మాయి, ఆమె తల్లి పెళ్లి చేసుకోవాలంటూ తన భర్తను తీవ్ర ఒత్తిడికి గురి చేశారని తెలిపింది. అలా వేధింపులు భరించలేకే వారిని కొంతకాలంగా జానీ మాస్టర్ దూరం పెట్టారని, ఆ కక్షతోనే తన భర్తపై అక్రమంగా కేసు పెట్టారని సుమలత వాపోయింది. తనకు, తన పిల్లలకు ఏం జరిగినా ఆ తల్లీకూతుళ్లదే బాధ్యత అని పేర్కొంది. ఈ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తమకు న్యాయం చేయాలని జానీ మాస్టర్ భార్య సుమలత, పిల్లలు వేడుకున్నారు.       


Similar News