IPL 2025 : చెన్నయ్ బోణీ.. ఉత్కంఠభరిత మ్యాచ్లో ముంబైపై విజయం
ఐపీఎల్-2025లో చెన్నయ్ సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో చెన్నయ్ సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. ముంబై ఇండియన్స్ను ఓడించి తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టింది. ఆదివారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా చెన్నయ్ బౌలర్లు నూర్ అహ్మద్(4/18), ఖలీల్ అహ్మద్(3/29) విజృంభించడంతో ముంబై 155/9 స్కోరుకే పరిమితమైంది. తిలక్(31), కెప్టెన్ సూర్యకుమార్(29), దీపక్ చాహర్(28 నాటౌట్) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. అనంతరం 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చెన్నయ్ కాస్త శ్రమించాల్సి వచ్చింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(53) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగి మ్యాచ్ను సీఎస్కే వైపు తిప్పేశాడు. ఇక, రచిన్ రవీంద్ర(65 నాటౌట్) చివరి వరకూ నిలిచి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. చెన్నయ్ 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే గెలుపు తీరాలకు చేరింది. దీంతో చెన్నయ్ లీగ్ను విజయంతో ఆరంభించింది. మరోవైపు, ఓటమితో ఐపీఎల్ను మొదలుపెట్టే అలవాటును ముంబై కొనసాగించింది.