ఈ కాలుష్యంలో మన వాటా ఎంత?
ప్రపంచ పర్యావరణానికి ప్రజారోగ్యానికి ప్లాస్టిక్ తీవ్ర హాని కల్పిస్తుంది. జీవజాతి మనుగడనే ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తున్న

ప్రపంచ పర్యావరణానికి ప్రజారోగ్యానికి ప్లాస్టిక్ తీవ్ర హాని కల్పిస్తుంది. జీవజాతి మనుగడనే ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తున్న ప్లాస్టిక్ భూతం, మానవ జీవితాల్లోకి శరవేగంగా చొచ్చుకొస్తోంది. ఇంగ్లాండులోని లీడ్స్ యూనివర్సిటీ పరిశోధకులు గత సంవత్సర అధ్యయనం ప్రకారం ప్రపంచంలో ఏటా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతుంది. ఇలా పుట్టుకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్ధాల నియంత్రణ, సమర్థ నిర్వహణకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కంకణబద్ధం కావలసిన సమయం ఆసన్నమైంది.
ప్రపంచాన్ని ప్లాస్టిక్ కాలుష్యంతో ముంచి వేయటంలో అనేక దేశాల కంటే మన భారతదేశం ప్రపంచంలో మొద టి స్థానంలో ఉంది అని ప్రఖ్యాత నేచర్ జర్నల్ తాజా అధ్యయనం తేల్చింది. ఇలా మన తర్వాత స్థానాల్లో నైజీరి యా, ఇండోనేషియా, చైనాలు ఆ పాపాన్ని పంచుకుంటున్నాయని, ఈ అధ్యయనాన్ని నిర్వహించిన లీడ్స్ విశ్వ విద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. మానవాళికే కాకుండా ఇతర జంతు జాలానికి, పర్యావరణానికి కూడా ప్లాస్టిక్ పెనుముప్పుగా పరిణమిస్తుంది. ఈ పాపంలో మన వాటా ఎక్కువగా ఉన్నందున తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలో ఆలోచించుకోవాల్సిన తరుణమిది.
ప్లాస్టిక్ బాంబుపై కూర్చున్నాం
ప్రపంచంలో అత్యంత అధికంగా ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేవి ధనిక దేశాలు.. కానీ వాటిలో ఒక్కటి కూడా టాప్ 90 కాలుష్యకారక దేశాల జాబితాలో లేవు. సుమారు 69 శాతం ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యం కేవలం 20 దేశాల నుంచి వస్తోంది. ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలే కావడం గమనార్హం! ధనిక దేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థా ల సేకరణ వాటి నిర్వహణ సమర్థంగా సాగుతుండటమే ఇందుకు కారణంగా ఈ అధ్యయనం అభిప్రాయపడుతోంది. భారతదేశంలో ఏటా 58 లక్షల టన్నుల ప్లాస్టిక్ను కాలుస్తున్నాం. మరో 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ను పర్యావరణంలోకి (భూమి, నీరు, గాలిలోకి) వదులుతున్నాం. మొత్తంగా ఏడాదిలో సుమారు 90 లక్షల టన్నులకు పైగా ప్లాస్టిక్ భూతాన్ని ఈ ప్రపంచం మీదకు వదులుతున్నాం. ఆ మధ్య మన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం పరచినట్లు.. మనం ప్రస్తుతం ప్లాస్టిక్ బాంబుపై కూర్చున్నాం! ఆ మహమ్మారిని కట్టడి చేయడంలో విఫలమైతే అణ్వస్త్రాలను మించిన ముప్పును భావితరాలు ఎదుర్కోక తప్పదు. ఇంతటి దుర్భర దుస్థితి దాపురించకూడదంటే? ఎవరికి వారు ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. సంబంధిత వ్యర్థాల సద్వినియోగం పట్ల పాలకులు ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ సామాజిక బాధ్యతతో శ్రద్ధ వహించాలి.
ప్లాస్టిక్ భూతానికి ముగింపు..
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ తీవ్రత దృష్ట్యా ప్లాస్టిక్ భూతానికి ముగింపు పలికేందుకు జరిగిన అంతర్జాతీయ ఒప్పంద రూపకల్పనకు 170కి పైగా దేశాలు చర్చలు జరిపాయి. కానీ ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ ఒడంబడిక చిత్తశుద్ధితో ఎంత త్వరగా సాకారమైతే ప్రపంచ జీవజాతుల, మానవ మనుగడకు అంత మంచిది. ప్రమాదకర ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై పరిశోధనలకు చేయూత నివ్వాలి. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం ద్వారా ఖర్చు తగ్గిస్తూనే, నాణ్యతను పెంచవచ్చనే విదేశాల అనుభవాలతో పాఠం నేర్చుకోవాలి. ప్లాస్టిక్ వ్యర్థాలతో డీజిల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తే, వ్యర్థాలను సంపద సృష్టికి వినియోగించుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ నియంత్రణ నియమాలన్నీ సక్రమంగా అమలయ్యేలా చేస్తూ దాని వాడకం వల్ల కలిగే సమస్యలపై ప్రజలలో అవగాహన పెంచాలి. ప్రపంచ, దేశీయ పాలకులు, పాలితులు చిత్తశుద్దితో కంకణ బద్దులైతేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. అంతేకాదు సాధ్యమైన మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా పారేయకుండా సరియైన నిర్వహణకు అందజేయటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇలా భావితరాల నెత్తిన ప్లాస్టిక్ బాంబ్ నుండి ప్రభుత్వాలు రక్షణ కల్పించడానికి ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, సమర్థ నిర్వహణకు ప్రభుత్వాలు ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడి చిత్తశుద్ధితో కంకణబద్ధం కావలసిన తరుణమిది. పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించి అవగాహన, చైతన్యం పెంచుకొని ప్రజలు కూడా మేము సైతం అంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిందే.
- మేకిరి దామోదర్,
95736 66650