రాష్ట్రాల అస్తిత్వాన్ని కాపాడాలి..!

భారతదేశంలో సాంస్కృతిక భాష స్వేచ్ఛ భావాల ఉత్తేజాన్ని గూర్చి సెప్టెంబర్‌ 9వ తేదిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా

Update: 2024-09-21 01:15 GMT

భారతదేశంలో సాంస్కృతిక భాష స్వేచ్ఛ భావాల ఉత్తేజాన్ని గూర్చి సెప్టెంబర్‌ 9వ తేదిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ టెక్సాస్‌ ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపన్యసిస్తూ మూడు ముఖ్యమైన అంశాలని ప్రస్తావించారు. అందులో చాలా ప్రధానమైన అంశం భాషా రాష్ట్రాల అస్తిత్వంను గూర్చి భాషల అస్తిత్వం గూర్చి ప్రస్తావించారు.

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఈ విషయంగా చాలా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తీకరించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై ఆయన ఆలోచనలను డాక్యుమెంట్‌ చేస్తూ నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని మూడవ నిబంధన పార్లమెంట్‌కు ఇచ్చింది. భాషా ప్రాతి పదికపై రాష్ట్రాలను పునర్‌ వ్యవస్థీకరించాలని ఎంతో డిమాండ్‌ ఉన్నా, అలా పునర్‌ వ్యవస్థీకరణకు సమయం లేనందున ఈ ఏర్పాటు చేశారు.

పునర్‌వ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పరచి..

ఎడతెరపి లేని ఈ కోరికలను దృష్టిలో ఉంచుకుని పరిశీలించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ సంఘాన్ని నియమించారు. ఆ సంఘాలు తన నివేదికలో ఈ దిగువ రాష్ట్రాల ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా పార్ట్‌ ‘ఎ’లో ఆంధ్ర, అస్సాం, బిహార్‌, బొంబాయి, మధ్యప్రదేశ్‌, మద్రాసు, ఒరిస్సా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లను పేర్కొన్నారు. పార్ట్‌ ‘బి’లో హైదరాబాద్‌, జమ్మూకశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, మైసూర్‌, పాటియాలా, రాజస్థాన్‌, సౌరాష్ట్ర, ట్రావెన్‌‌కోర్‌, కొచ్చిన్‌లను పేర్కొన్నారు. పార్ట్‌ ‘సి’లో ఆజ్మీర్‌, భోపాల్‌, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, కచ్‌, మణిపూర్‌, త్రిపుర, వింధ్యప్రదేశ్‌లను పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రధానంగా మాట్లాడుతున్న భాషలుగా తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు, మరాఠీ, హిందీ, రాజస్థానీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా, కశ్మీర్‌‌లుగా గుర్తించారు.

రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ..

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ భాషా రాష్ట్రాల వ్యక్తిత్వాన్ని గురించి వివరిస్తూ..‘‘సమాఖ్య రాజ్యాంగం విజయవంతంగా పనిచేయడానికి రాష్ట్రాలు ఎక్కువగా సమతుల్యతలో ఉండడం అవసరమని నేను భావిస్తున్నాను. వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉన్నట్లయితే అది అనుమానాల్ని, అసంతృప్తిని కలిగించడమే కాదు, ఫెడరల్‌ వ్యవస్థనే విచ్చిన్నం చేయగల శక్తులను సృష్టించి దేశ ఐక్యతకే ప్రమాదకారి అవుతుందని సర్వత్రా దీనిని స్పష్టంగా గుర్తిం చారు. అనేక ఫెడరల్‌ రాజ్యాంగాలలో జనాభా, వనరుల విషయాలలో రాష్ట్రాల మధ్య విస్తృత వ్యత్యాసం ఉన్నప్పటికీ, పెద్ద రాష్ట్రాల ప్రాబ ల్యాన్ని హద్దుల్లో ఉంచేందుకు జాగ్రత్త తీసుకున్నారు. ఆ విధంగానే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. జనాభా వనరుల విషయంలో, ఆ రాష్ట్రాలు వ్యత్యాసాలతో ఉన్నాయి. ఉదాహరణకు జనాభా విషయంలో నెవాడా రాష్ట్రంతో పోలిస్తే న్యూయార్క్‌ రాష్ట్రం పెక్కు రెట్లు పెద్దది. అయినప్పటికీ రాజ్యాంగం సెనేట్‌లో ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం కల్పించింది. అందుకే రాహుల్‌ గాంధీ అమెరికాలో మాట్లాడుతూ భాషా రాష్ట్రాల, వ్యక్తిత్వాలను కాపాడాలని చెప్పడం ఈనాటి చారిత్రక సందర్భంలో చాలా ముఖ్యమైన అంశం.

లౌకికవాదాన్ని అణిచివేయాలని..

అలాగే డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా మన ముందుకు తెచ్చారు. మనం నేర్చుకునే భాషలోనే ముఖ్యమైన అంశాలున్నాయి. మత గ్రంథాలున్నాయి. హిందూ పురాణాలన్ని సంస్కృతంలోనే ఉన్నాయి. బైబిల్‌ హిబ్రూ నుండి తెలుగులోకి వచ్చింది. ఖురాన్ ఉర్దూ, పార్శీల నుండి తెలుగులోకి వచ్చింది. అందుకే అవన్నీ కొందరే చదువుతారు. చాలామంది విని మతాల్లో చేరినవారే కానీ చదివినవారు కారు. అందువలనే ఈ మత గ్రంథాలు ఎక్కువ మందికి అర్థం కాదు. అందుకే దేశీయమైన పాటలు, మాటలు, మనిషిని ఉత్తేజపరుస్తాయి. భాషా రాష్ట్రాలపైన హిందీని రుద్దాల్సిన అవసరం లేదు. ఆసక్తి ఉన్నవారు అన్ని భాషలు నేర్చుకుంటారు. ఒక్క హిందీ కాదు జర్మనీ, చైనీ భాషలు కూడా నేర్చుకుంటారు. దక్షిణ భారతదేశ చరిత్ర చాలా ఉన్నతమైనది. చారిత్రక మూలాల్లోకి వెళితే మానవ పరిణామ శాస్త్రం, పురాతత్వ శాస్త్రం. భాషా శాస్త్రం సమన్వయంగా మనకి లభ్యమవుతాయి. పాతరాతి, కొత్తరాతి అవశేషాలు మనకు లభ్య మవుతున్నాయి.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతభావాలతో లౌకికవాదాన్ని అణచివేయాలని చూస్తున్నారని రాహుల్‌ గాంధీ చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాలన్ని రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రాల భాషా చరిత్ర సంస్కృతుల అస్తిత్వాన్ని కాపాడాల్సిన చారిత్రక సందర్భం ఇది. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తితో భారతదేశ సమైక్యతను రాష్ట్రాల భాషా, చరిత్రల అస్తిత్వాన్ని అందరూ కలిసి కాపాడుకుంటారని ఆశిద్దాం. ఆ దిశగా నడుద్దాం.

డా. కత్తి పద్మారావు

98497 41695

Tags:    

Similar News