గ్రూప్ ఇన్సూరెన్స్ చందా పెంచాలి!

గతంలో అమలులో ఉన్న కుటుంబ సంక్షేమ పథకం అనగా ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం

Update: 2024-09-05 00:30 GMT

గతంలో అమలులో ఉన్న కుటుంబ సంక్షేమ పథకం అనగా ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 293 ఆర్థిక మరియు ప్రణాళికా శాఖ తేదీ 8.10.1984 ద్వారా ప్రవేశపెట్టారు. తక్కువ ఖర్చుతో బీమా ఫలాలను మరణించిన ఉద్యోగి కుటుంబానికి అందజేయడం, పదవీ విరమణ చేసే నాటికి ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్దేశంతోఈ పథకం ప్రారంభమైంది. 

అయితే ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం దీనిని ఏర్పరచినప్పటికీ ఈ స్కీంకు సంబంధించిన చందాను అంటే యూనిట్స్‌ను కాలానుగుణంగా పెంచకపోవడం వలన మరణించిన ఉద్యోగికి లభించే మొత్తం మారడం లేదు. చాలా మంది ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది, డ్రాయింగ్ అధికారులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం గురించి సరియైన అవగాహన ఉండటం లేదని గుర్తించడం జరిగింది. దీంతో కొన్ని సందర్భాల్లో ఉద్యోగి నెల జీతం నుండి వర్తించే గ్రూప్ ప్రీమియం కంటే ఎక్కువ తక్కువ రికవరీ చేయడంతో ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉంది.

దీనిలోని ముఖ్యంశాలు...

తేదీ 1.11.1984 నాటికి సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఉద్యోగులు, 10 సంవత్సరాలు నిండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన వర్క్ ఛార్జడ్ ఉద్యోగులు అలాగే 1.11.1984 తర్వాత నియమితులైన వారు కూడా ఈ పథకంలో సభ్యులుగా ఉంటారు. ఈ పథకంలోని సభ్యులను ఏ,బి,సి,డి అను నాలుగు గ్రూపులుగా.. ఉద్యోగుల వేతన స్కేలు గరిష్ట పరిమితి ఆధారంగా విభజించారు. ఏ గ్రూపు 8 యూనిట్లు, బి గ్రూపు 4 యూనిట్లు, సి గ్రూపు 2 యూనిట్లు, డి గ్రూపు 1యూనిట్ ప్రతినెల సభ్యత్వ రుసుముగా ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ఈ పథకం మొదలైనప్పుడు ప్రతి యూనిట్ విలువను 10 రూపాయలుగా నిర్ణయించారు. అంటే ఉద్యోగి చెల్లించే ప్రతి యూనిట్ నుంచి ఇన్సూరెన్స్ నిధికి, సేవింగ్స్ నిధికి జమవుతాయి. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 367 ఆర్థిక, ప్రణాళిక శాఖ తేదీ 15.11.94 ద్వారా యూనిట్ సభ్యత్వ రుసుమును 15/- రూపాయలుగా పెంచారు. ఇందులోంచి 4.50/- బీమా నిధికి, 10.50/- సేవింగ్ నిధికి జమ చేస్తారు.

గ్రూప్ సభ్యత్వం ఎప్పుడు మారుతుందంటే...!

ఎవరైనా ఉద్యోగి నవంబర్లో కాక ఇతర నెలలో నియామకం అయితే వారికి బీమా వర్తించేందుకు వారు ఏ గ్రూపునకు చెందుతారో దానిని బట్టి గతంలో ప్రతి యూనిట్‌కు 3/- అలాగే ప్రస్తుతము 4.50/- చొప్పున నియమిత నెల నుంచి తదుపరి అక్టోబర్ నెల వరకు రికవరీ చేయాల్సి ఉంటుంది. మరల నవంబర్ నెల నుంచి యూనిట్ల మొత్తాన్ని రికవరీ చేయాలి. ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో పదోన్నతి పొందిన, వేతన స్కేలు గరిష్ట పరిమితి మారినను తదుపరి నవంబర్ నెల నుంచి మాత్రమే అతని గ్రూప్ సభ్యత్వం మారుతుంది. కొన్ని సందర్భాల్లో వెనుకటి తేదీ నుంచి అనగా నోషనల్ ప్రమోషన్ ఇచ్చినప్పటికీ సభ్యత్వ గ్రూప్ రుసుము వెనుకటి తేదీ నుంచి మారదు. ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే అతని సభ్యత్వ గ్రూపును బట్టి ఎంత ప్రీమియం చెల్లిస్తున్నాడో అన్ని వేల రూపాయలతో పాటు సేవింగ్స్ మొత్తాన్ని అమలులో ఉన్న వడ్డీతో పాటు చెల్లిస్తారు. ఉద్యోగి పదవీ విరమణ లేదా రాజీనామా చేసినను సేవింగ్స్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. ప్రభుత్వం కాలానుగుణంగా వడ్డీ రేట్లు మారుస్తుంది.

మృత ఉద్యోగులకూ మేలు చేకూరలే...!

ఈ స్కీంకు సంబంధించిన చందాను అంటే యూనిట్స్‌ను కాలానుగుణంగా పెంచకపోవడం వలన మరణించిన ఉద్యోగికి లభించే మొత్తం మారడం లేదు. ఉదాహరణకు 15/- చందా చెల్లిస్తున్న వ్యక్తి మరణించినట్లయితే 15,000, 30/- చందా చెల్లిస్తున్న వ్యక్తి మరణించినట్లయితే 30,000, 60/- చెల్లిస్తున్న చందా చెల్లిస్తున్న వ్యక్తి మరణించినట్లయితే 60,000 అట్ల గరిష్టంగా 1,20,000 మాత్రమే లభిస్తుంది. ప్రతి ఐదేళ్లకు ఎపిజిఎల్ఐకి సంబంధించిన చందాను పెంచుతున్నారు కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ సంబంధించిన చందాను పెంచడం లేదు. దీనివల్ల మరణించిన ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు లభించడం లేదు. 1994 సంవత్సరంలో పెంచిన సబ్‌స్క్రిప్షన్‌ను గత 30 సంవత్సరాల నుండి పెంచలేదు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ ఏర్పాటు జరుగుతున్నప్పటికీ, ఏ పే రివిజన్ కమిషన్ కూడా 1998 నుండి 2018 వరకు అంటే 5వ పే రివిజన్ కమిషన్లు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్‌ను పెంచడాన్ని సిఫార్సు చేయలేదు. కానీ దేశంలోని చాలా రాష్ట్రాలలో గ్రూప్ ఇన్సూరెన్స్ సబ్‌స్క్రిప్షన్స్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచడం జరుగుతున్నది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రూప్ ఇన్సూరెన్స్ చందాను క్రమానుగతంగా పెంచుకుంటూ పోవడం చాలా అవసరం.

సి. మనోహర్ రావు

96406 75288

Tags:    

Similar News