ఉసురు తీసిన ఉత్సాహం..ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు

సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.

Update: 2024-08-25 04:39 GMT

దిశ,వెబ్‌డెస్క్:సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటన మూడు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కొత్తపల్లికి చెందిన పోతిరెడ్డి లోకేష్ (19), కందురి చందుకిరణ్ (18), బత్తుల మణికంఠరెడ్డి (18) ముగ్గురు స్నేహితులు సరదాగా సాగర్ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వారిలో కొత్తపల్లికి చెందిన పోతిరెడ్డి లోకేష్ రెడ్డి (19) మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన మరో ఇద్దరు యువకులు కొర్లమడుగు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన కుందూరు కిరణ్ కుమార్ రెడ్డి, బత్తుల మణికంఠ రెడ్డి గా స్థానికులు గుర్తించారు.

గల్లంతైన ముగ్గురు విద్యార్థులు దర్శిలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు మృతుల బంధువులు తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇలా కానరాని లోకాలకు వెళ్ళటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటనతో మృతుల గ్రామాల్లోని బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News