హైదరాబాద్ నగరంలో దారుణం.. ఆస్తి కోసం బావమరిదిని హత్య చేయించిన బావ

ఆస్తి కోసం సొంత బావమరిదిని బావ సుపారీ ఇచ్చి హత్యచేయించిన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-09-14 08:19 GMT

దిశ, శేరిలింగంపల్లి: ఆస్తి కోసం సొంత బావమరిదిని బావ సుపారీ ఇచ్చి హత్యచేయించిన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన యశ్వంత్ (25) ఉద్యోగం కోసం నగరానికి వచ్చి గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్ సమీపంలో బావకు చెందిన బాలాజీ పీజీ హాస్టల్‌లో ఉంటూ జాబ్ కోసం వెతుకుతున్నాడు. అయితే, ఈనెల 1న అనుమానాస్పద స్థితిలో యశ్వంత్ హాస్టల్‌ల్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా కావలిలో యశ్వంత్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని ఖననం చేశారు. అనుమానం వచ్చిన మృతిని తండ్రి శుక్రవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి బావను అదుపులోకి తీసుకుని విచారించగా ఆస్తి కోసం తనే సుపారీ ఇచ్చి యశ్వంత్‌ను హత్య చేయించి, ఆత్మహత్యగా చిత్రీకరించినట్లుగా ఒప్పుకున్నాడు. పోలీసులు ప్రధాన నిందితుడైన మృతుడి బావను అదుపులోకి తీసుకున్నారు. కాగా, యశ్వంత్‌ను చంపేందుకు సుపారీ తీసుకున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. అందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Similar News