నకిరేకల్ పీఎస్ ఎదుట మహిళ ఆందోళన.. ఎస్సైపై సంచలన ఆరోపణలు
నకిరేకల్ పోలీస్ స్టేషన్ (Nakirekal Police Station) ఎదుట మహిళ ఆందోళనకు దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్డెస్క్: నకిరేకల్ పోలీస్ స్టేషన్ (Nakirekal Police Station) ఎదుట మహిళ ఆందోళనకు దిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. కేతేపల్లి (Kethepally)కి చెందిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన మేన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతడి భార్య నకిరేకల్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. అయితే, రోజులు గడిచినా.. తన భర్తకు నోటీసులు ఇవ్వకుండా స్టేషన్ సిబ్బంది కాలయాపన చేస్తున్నారని ఇవాళ ఉదయం సదరు మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అనంతరం అక్కడున్న సిబ్బందిపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త ఓ కానిస్టేబుల్ కావడంతోనే అందరూ కుమ్మక్కు అయి తనకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నీరు పెట్టింది. ముఖ్యంగా ఎస్సై తప్పుడు రిపోర్టును సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. ఈ క్రమంలోనే తన భర్తపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తూ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగింది.