విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఆరు ఎద్దులు బలి..!

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుదాఘాతానికి గురై ఆరు ఎద్దులు మృతి చెందిన సంఘటన మాడుగుల మండల పరిధిలో జరిగింది.

Update: 2023-06-01 13:59 GMT

దిశ, ఆమనగల్లు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుదాఘాతానికి గురై ఆరు ఎద్దులు మృతి చెందిన సంఘటన మాడుగుల మండల పరిధిలో జరిగింది.  వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి నల్లచెరువు గ్రామంలో ఇటీవల ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్   స్తంభాలు నేలకొరిగాయి. కేవలం మోకాళ్ల ఎత్తులోనే విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. ఈ విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలిపిన వాటిని సరిచేయకపోగా.. అలాగే ఆ లైన్ కు విద్యుత్ సరఫరా చేశారు. ఈ క్రమంలోనే గురువారం అటువైపు కట్ట అంజయ్యకు చెందిన రెండు ఎద్దులు, కట్ట పోచయ్యకు చెందిన రెండు ఎద్దులు, యాదయ్యకు చెందిన ఒక ఎద్దు, యాదమ్మకు చెందిన ఒక ఎద్దు మొత్తం ఆరు ఎద్దులు విద్యుత్ తీగలు నేలకూలిన వైపు మేత మేసేందుకు వెళ్లాయి.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు  ఆరు ఎద్దులు విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. చనిపోయిన ఎద్దుల విలువ సుమారు రూ. 4లక్షల వరకు ఉంటుందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రైతులను పరామర్శించి, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని తెలిపారు. తక్షణ ఆర్థిక సహాయంగా రూ.10వేలు అందజేశారు. అదేవిధంగా ఐక్యత ఫౌండేషన్ తరపున బాధిత రైతులకు రూ.30వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

Tags:    

Similar News