RBI: ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ను అభినందించిన ప్రధాని మోడీ

వరుసగా రెండోసారి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా ఎంపికైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను అభినందించారు.

Update: 2024-08-21 08:16 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: వరుసగా రెండోసారి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా ఎంపికైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను అభినందించారు. సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌లో మోడీ వ్యాఖ్యానిస్తూ, ఈ ఘనతకు సాధించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌‌కు అభినందనలు. అది కూడా రెండోసారి. ఇది ఆర్‌బీఐలో ఆయన నాయకత్వానికి, ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి భరోసా ఇవ్వడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపు అని అన్నారు.

గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 1994 నుండి సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్‌లను ప్రచురిస్తుంది. 2024 ఏడాదికి కూడా ఈ జాబితాలో శక్తికాంత దాస్ అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్‌గా A+" రేటింగ్ పొందారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని అత్యుత్తమ కేంద్ర బ్యాంక్‌ గవర్నర్‌లను ఎంపిక చేశారు. వారు డెన్మార్క్‌కి చెందిన క్రిస్టియన్ కెట్టెల్ థామ్‌సెన్, స్విట్జర్లాండ్‌కు చెందిన థామస్ జోర్డాన్ “A+” రేటింగ్‌ను అందుకున్నారు. వీరిలో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో నిలిచారు. వడ్డీ రేట్లను నిర్వహించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు అలాగే కరెన్సీ స్థిరత్వాన్ని కొనసాగించడం వంటి రంగాల్లో పనితీరు ప్రాతిపదికన "A+" నుండి "F" రేటింగ్ కేటాయిస్తారు. పనితీరు అద్భుతంగా ఉంటే A+, అదే సరిగ్గా లేకపోతే F రేటింగ్ ఇస్తారు.

Tags:    

Similar News