పునరుత్పాదక ఇంధనం, రోడ్లు, రియల్ ఎస్టేట్ విభాగాల్లో 38% పెరగనున్న పెట్టుబడులు

భారతదేశ మౌలిక సదుపాయాల రంగాల్లోని పునరుత్పాదక ఇంధనం, రోడ్లు, రియల్ ఎస్టేట్ విభాగాల్లో పెట్టుబడులు 2025-26 నాటికి 38 శాతం పెరిగి రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ జూన్ 18న తెలిపింది

Update: 2024-06-18 12:55 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశ మౌలిక సదుపాయాల రంగాల్లోని పునరుత్పాదక ఇంధనం, రోడ్లు, రియల్ ఎస్టేట్ విభాగాల్లో పెట్టుబడులు 2025-26 నాటికి 38 శాతం పెరిగి రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ జూన్ 18న తెలిపింది. ప్రధానంగా కొత్త ప్రభుత్వం తీసుకుబోయే నిర్ణయాలతో పాటు ఈ రంగంలోని కంపెనీల మార్జిన్‌లను మెరుగుపరచడం ద్వారా ఈ విభాగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతాయని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. నివేదిక ప్రకారం, స్థిరమైన మౌలిక సదుపాయాల కోసం మెరుగైన భౌతిక కనెక్టివిటీ, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ రంగాల్లో వృద్ధి స్థిరంగా ఉంటుంది.

పునరుత్పాదక శక్తిలో, ప్రభుత్వం 2030 నాటికి 450 గిగావాట్ల స్థాపిత సౌర, పవన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రహదారి మౌలిక సదుపాయాల పరంగా హైవే నిర్మాణంలో భారతదేశ రోడ్ల రంగం 11 శాతం వృద్ధిని సాధిస్తుందని క్రిసిల్ పేర్కొంది. 2024-25, 2025-26లో 12,500 కి.మీ జాతీయ రహదారులు నిర్మించబడతాయని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది, ఇది 2023-24లో నిర్మించిన 12,349 కి.మీ జాతీయ రహదారుల కంటే కొంచెం ఎక్కువ.

రియల్ ఎస్టేట్ రంగంలో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ డిమాండ్, రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో 8-10 శాతం పెరగనుంది, అయితే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ డిమాండ్ 8-12 శాతం వద్ద కొనసాగుతుందని క్రిసిల్ పేర్కొంది. CRISIL సీనియర్ డైరెక్టర్, చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ మాట్లాడుతూ.. ఈ మూడు రంగాల్లో అంతర్లీన డిమాండ్ డ్రైవర్లు బలంగా ఉన్నాయి, రెగ్యులర్ పాలసీ జోక్యాలు పెట్టుబడిదారుల ఆసక్తికి ఆజ్యం పోస్తున్నాయని అన్నారు.


Similar News