Vision Paper: అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు 30 ట్రిలియన్ డాలర్లకు చేరాలి: నీతి ఆయోగ్

లక్ష్యాన్ని చేరేందుకు తొమ్మిది రెట్లు పెరగవలసి ఉంది. తలసరి ఆదాయం కూడా 8 రెట్లు పెరగాలని వివరించింది.

Update: 2024-07-28 13:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే చాలా కృషి చేయాల్సి ఉందని నీతి ఆయోగ్ 'విజన్ ఫర్ వికసిత్ భారత్ @2047' పేపర్ అభిప్రాయపడింది. అందుకోసం 2047 కల్లా దేశ ఆర్థికవ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లకు చేరడమే కాకుండా తలసరి ఆదాయం 18,000 డాలర్లకు చేరాలని పేర్కొంది. అంతేకాకుండా దేశం మధ్య-ఆదాయ ఆలోచన నుంచి బయటపడాలని, అందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని వెల్లడించింది. ప్రస్తుతం భారత జీడీపీ 3.36 ట్రిలియన్ డాలర్లు ఉండగా, లక్ష్యాన్ని చేరేందుకు తొమ్మిది రెట్లు పెరగవలసి ఉంది. తలసరి ఆదాయం కూడా ఇప్పుడున్న 2,392 డాలర్ల నుంచి 8 రెట్లు పెరగాలని వివరించింది. మధ్య-ఆదాయం నుంచి అధిక-ఆదాయం స్థాయికి పురోగమించేందుకు 20-30 సంవత్సరాల పాటు 7-10 శాతం సగటు వృద్ధిని కొనసాగించాలి. చాలా తక్కువ దేశాలు మాత్రమే దీన్ని సాధించగలవని విజన్ పేపర్ తెలిపింది. వికసిత్ భారత్ భావనను వివరించిన విజన్ పేపర్.. నేతి అధిక ఆదాయ దేశాలతో సరిపోల్చడం, తలసరి ఆదాయంలో అభివృద్ధి చెందిన దేశ లక్షణాలను కలిగి ఉండటంగా పేర్కొంది. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు దేశంలోని వ్యవసాయ రంగంలో ఉన్న శ్రామికశక్తి స్థాయిలో పారిశ్రామిక రంగంలోనూ ఉండాలని, తద్వారా భారత్‌ను ప్రపంచ తయారీ, సేవా కేంద్రంగా మార్చేందుకు పరిశ్రమల్లో పోటీతత్వాన్ని మెరుగుపరచడం కూడా అవసరమని విజన్ పేపర్ స్పష్టం చేసింది. 

Tags:    

Similar News