Airtel: 10 నిమిషాల్లో ఇంటి వద్దకే ఎయిర్టెల్ సిమ్ కార్డు
కస్టమర్లు నామమాత్రపు ఛార్జీ రూ. 49తో నేరుగా వారి ఇంటి వద్దకే సిమ్ కార్డ్లను డెలివరీ అందుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వినియోగదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లకు కేవలం 10 నిమిషాల్లో తన ఇంటివద్దకే సిమ్ కార్డులను అందించనుంది. దీనికోసం ప్రముఖ క్విక్ కామర్స్ పాట్ఫామ్ బ్లింక్ఇట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా కస్టమర్లు నామమాత్రపు ఛార్జీ రూ. 49తో నేరుగా వారి ఇంటి వద్దకే సిమ్ కార్డ్లను డెలివరీ అందుకోవచ్చని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. సిమ్ కార్డు అందుకున్న తర్వాత నేరుగా ఆధార్ ఆధారిత కేవైసీ ప్రక్రియను ఉపయోగించి సిమ్ని యాక్టివేట్ చేయవచ్చు. వినియోగదారులు ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ సేవలను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఎయిర్టెల్ నెట్వర్క్కు మారడానికి నంబర్ పోర్టబిలిటీ రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్ లింక్, ఇన్స్ట్రక్షన్ యాక్టివేషన్ వీడియో అందుబాటులో ఉంటుందని కంపెనీ వివరించింది. ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే కంపెనీకి చెందిన ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మొదటి దశలో ఈ సౌకర్యం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్, కోల్కతా సహా 16 ప్రధాన నగరాల్లో ప్రారంభించారు. భవిష్యత్తులో దశలవారీగా అన్ని నగరాలు, పట్టణాలకు సేవలు విస్తరించనున్నట్టు ఎయిర్టెల్ పేర్కొంది. అయితే, సిమ్ కార్డును డెలివరీ తీసుకున్న 15 రోజుల్లోగా యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కంపెనీ స్పష్టం చేసింది. ఎయిర్టెల్తో భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు చాలా సమయం ఆదా అవుతుందని బ్లింక్ఇట్ సీఈఓ అల్బిందర్ దిండ్సా చెప్పారు.