సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్న బాబు, జగన్.. వారిపై మళ్లీ ఫోకస్

దిశ, ఏపీ బ్యూరో: ఎన్నికల హడావిడి మొదలవుతున్న నేపథ్యంలో పార్టీలకు తమ పెద్దలు గుర్తొస్తున్నారు. ఇన్నాళ్లూ తమదే గొప్ప అన్నట్టు స్పీచ్‌లు

Update: 2022-09-03 02:19 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఎన్నికల హడావిడి మొదలవుతున్న నేపథ్యంలో పార్టీలకు తమ పెద్దలు గుర్తొస్తున్నారు. ఇన్నాళ్లూ తమదే గొప్ప అన్నట్టు స్పీచ్‌లు ఇచ్చిన అధినేతలు.. ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లాలంటే పెద్దోళ్ల ఇమేజ్‌నే నమ్ముకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం జరిగిన విస్తృత సమావేశంలో ఎన్టీఆర్ భజన చేస్తే, సీఎం జగన్ తన తండ్రి వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఒకేసారి ఇద్దరు ప్రధాన నేతలకు తమ పెద్దలు గుర్తుకు రావడం మాత్రం విశేషమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వైఎస్సార్ వర్ధంతి వేళ కడప టూర్‌లో జగన్

దివంగత ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం  కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇతర కార్యక్రమాల కోసం పులివెందులకు బయలుదేరి వెళ్లారు. అక్కడ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. విడతలవారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై స్థానిక నాయకులు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పలు అంశాలపై మాట్లాడారు. ''గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రూ.3వేల కోట్లు పంటల బీమా అందించాం. ఆ ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిది. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్స్‌ ఏజెన్సీపైనా సమీక్షించారు. రైతులు ఈ-క్రాప్‌ తప్పనిసరిగా చేయాలి. ఆస్పత్రుల్లో వైద్యుల నియామకాలపైనా మాట్లాడారు. వైద్య, ఆరోగ్యశాఖలోనే 40వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. చక్రాయపేట మండలంలో రూ.1200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ టూర్ మొత్తం కూడా తండ్రి వైఎస్సార్‌ను, ఆయన ఆశయాలను పదేపదే ప్రస్తావనకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల జగన్ పాలనపై అసంతృప్తి వెలువడుతున్న నేపథ్యంలో గడపగడపకూ ప్రోగ్రాంలో వ్యతిరేకత వెలువడుతున్న రీత్యా జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జనంలో ఉన్న అపారమైన అభిమానాన్ని మరోసారి తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించాక జగన్ ఇంతిలా తండ్రి ప్రస్తావన తేవడం, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని'' చెబుతుండడం ఇదే తొలిసారి దీంతో అందరి దృష్టి అటు వైపు మళ్లింది.

టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. ఆద్యంతం ఎన్టీఆర్ జపమే..

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ భేటీ శుక్రవారం జరిగింది. ముందుగా పార్టీ జెండా ఎగరవేసిన చంద్రబాబు అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, అందులో టీడీపీ పాత్ర, భవిష్యత్ రాజకీయాలు వంటి అంశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సేవల్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అసలు దేశంలో మొట్టమొదటగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఎన్టీఆరే అని, పేదవాడికి తక్కువ ధరకే బియ్యం పెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది అని కొనియాడారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి తెలియ జేసిన ఘనత ఎన్టీఆర్‌దే అని చెప్పుకొచ్చారు. తెలుగువాడి ఆత్మవిశ్వాసాన్ని తెలియ జేసింది మాత్రం తానేనని తన పేరు కూడా జోడించే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం జాతీయ భావాలున్న ప్రాంతీయ పార్టీ అని, గత విజయాలు నెమరవేసుకోవాలని, ఎన్టీఆర్ ఆశయాలను ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు. ''ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం అవసరాన్ని నాడు చాటి చెప్పాం. కానీ ఇవాళ పరిస్థితులు చూస్తుంటే పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదు. నేడు ఎక్కడ చూసినా విద్వేషమే ఉంది. పాలకుల విజన్ పోయి పాయిజన్‌గా తయారయ్యింది. తమకు రావాల్సిన బకాయిలపై అనంతపురంలో కానిస్టేబుల్ ప్లకార్డు పట్టుకున్నాడు. ఆయనను టార్గెట్ చేశారు. ఉద్యోగం నుంచి తొలగించారు. కానిస్టేబుల్ తనను వేధించలేదు అని చెప్పిన శ్రీలక్ష్మిని వేధిస్తున్నారు. కానిస్టేబుల్ ప్రకాష్ ఇప్పుడు కనపడడం లేదు. సమస్యల్ని ప్రస్తావిస్తే..దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రపంచంలో తెలుగుజాతి ఉన్నత స్థితిలో ఉండడమే ఎన్టీఆర్‌కూ.. తనకూ అన్నిటికంటే సంతృప్తి. 27 ఏళ్ల క్రితం పార్టీ చేసిన పనులు, ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. అమెరికాలో ఉండే అమెరికన్ ఆదాయం 65 వేల డాలర్లను, కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ ఆదాయం 1.25 లక్షల డాలర్లు అని'' చంద్రబాబు గుర్తు చేశారు.

ప్రజల్లోని సెంటిమెంట్‌ను తమ వైపు మరల్చే ప్రయత్నం చేస్తున్న నేతలు

నిజానికి వైఎస్ఆర్, ఎన్టీఆర్ అనే రెండు పేర్లూ తెలుగు తనంతో ముడిపడిపోయాయి. వాళ్ల ఆహార్యం కానీ, రాష్ట్రం పట్ల వారు చూపిన అంకిత భావం కానీ ఎనలేనిది. అందుకనే పార్టీలకతీతంగా వారికి అభిమానులు తెలుగువాళ్లలో ఉన్నారు. పార్టీపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో పాలకపక్షానికి, గత ఎన్నికల్లో దెబ్బతిని ఉనికి కోసం పాటుపడుతున్న ప్రధాన విపక్షానికి ప్రస్తుతం తమ తమ పెద్దలు గుర్తుకు రావడానికి వారి ఇమేజ్‌ను వాడుకోవడానికే అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వెలువడుతున్నది.

Also Read : TDP: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన N. Chandrababu Naidu 


Similar News