రాష్ట్రంలో ఆపరేషన్ గరుడ.. మెడికల్ షాప్లలో అధికారుల తనిఖీలు
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన గురుడ టీమ్.. రాష్ట్ర వ్యాప్తంగా తన దూకుడు ప్రదర్శిస్తుంది.

దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన సంస్థలు.. రాష్ట్ర వ్యాప్తంగా తన దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గంజాయి అమ్మే వారితో పాటు వాడుతున్న వారిపై ఉక్కుపాదం మొపుతుండటంతో.. గంజాయి ఎక్కడ దొరకడం లేదు. దీంతో మత్తు పదార్థాలకు అలవాటు పడిన పలువురు యువకులు మెడికల్ షాప్లలో లభ్యం అయ్యే వివిధ రకాల డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. దీంతో అటువంటి మత్తు పదార్థాల అమ్మకాలపై దృష్టి సారించిన అధికారులు రాష్ట్రంలో ఆపరేషన్ గరుడను కొనసాగిస్తున్నారు.
ఇందులో భాగంగా.. మెడికల్ షాప్లలో ఏకకాలంలో 100 కు పైగా బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కడప, నెల్లూరు, అనంతపురం, ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడల్లో విజిలెన్స్, ఈగల్, డ్రగ్ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఇందులో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా నిషేదిత మందులు (డ్రగ్స్) అమ్ముతున్న మెడికల్ షాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో.. పలు మెడికల్ షాప్లలో కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ కు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు రాష్ట్ర ప్రజలకు సూచించారు.