వరదల విలయం..రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దిశ,వెబ్డెస్క్:రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోని విజయవాడ, తెలంగాణ(Telangana)లోని ఖమ్మం జిల్లాలను వరదలు(Flood) ముంచెత్తాయి. ఈ వరదల నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ఆయన నేటి(గురువారం) నుంచి రెండురోజుల పాటు ఏపీ, తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈరోజు ఏపీలోని విజయవాడ, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. బాధిత కుటుంబాలు, రైతులను పరామర్శిస్తారు. ఆ తర్వాత విజయవాడలో అధికారులతో సమావేశమవుతారు. నష్టం అంచనాపై అధికారులతో చర్చిస్తారు. తర్వాత రేపు(శుక్రవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. వరదలతో అతలాకుతలమవుతున్న ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు.