విశాఖ సముద్ర తీరాన ఘటన.. సముద్రం మధ్యలో మరబోటు దగ్ధం

అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో మెకనైజ్డ్ బోటు ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో బోటు దగ్ధమైంది.

Update: 2024-09-29 08:11 GMT

దిశ ప్రతినిధి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో మెకనైజ్డ్ బోటు ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో బోటు దగ్ధమైంది. బడే సూర్యనారాయణ చెందిన ఐఎన్డీ ఏపీ వీ5 ఎంఎం 294 నెంబర్ గల మెకనైజ్డ్ బోటు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుండి శుక్రవారం వేటకు వెళ్ళింది. శనివారం వేట సాగించాక ఆదివారం తెల్లవారుజామున చేపల వేటకు సముద్రంలో వల వేసే సమయంలో ఒక్కసారిగా ఇంజన్ నుండి మంటలు రావడంతో బోటులో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే మంటలు ఆరకపోవడంతో వారంతా సముద్రంలోకి దూకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొంటూ ఈదుకుంటూ వస్తున్న సమయంలో 683 నెంబర్ గల శ్రీనివాసరావుకు చెందిన బోటు తారసపడడంతో ఆ బోటు ఎక్కి ఆదివారం ఉదయం వారంతా ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. విషయం తెలియగానే ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అధికారులు, పోలీసులతో మాట్లాడి మత్స్యకారులకు చేయూత ఇవ్వాలని కోరారు. ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులో జి.ఎల్లాజీ, జి.రాము, బి.ధనరాజ్, ఆర్.ఎర్రయ్య, గరికిన ఎల్లాజీ, పి వీరాస్వామి, సీహెచ్ నల్లోడు ఉన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మర పడవల సంఘం ప్రధాన కార్యదర్శి సురపతి నర్సింగరావు మీడియాతో మాట్లాడుతూ బోటు ఇంజిన్‌లో మంటలు చెలరేగుతున్న సమయంలో ప్రమాదాన్ని పసిగట్టిన మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సముద్రంలోకి దూకి ఈదుకుంటూ వస్తున్న సమయంలో శ్రీనివాసరావుకు చెందిన 683 నెంబర్ గల తారసపడడంతో వారంతా ఆ బోటు ఎక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని తెలిపారు. బోటు ఓనర్ మరియు మత్స్యకారులకు ప్రభుత్వం తగు న్యాయం చేయాలని కోరారు. కాలిపోయిన బోటుకు పరిహారం వెంటనే ఇవ్వాలని రాష్ట్ర మర పడవలు సంఘం ప్రధాన కార్యదర్శి సురపతి నర్సింగరావు అన్నారు.ఇప్పటికే ఈ విషయాన్ని మత్స్యశాఖ. మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వివరించారు.బోటు ఖరీదు 35 నుంచి 36 లక్షలు ఉంటుందని అది అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మరపడవల సంఘం ఉపాధ్యక్షులు గరికిన పరుశురాం, కార్యదర్శులు ఎస్. గురుప్రసాద్,మున్నం బాలాజీ 37వ వార్డు జనసేన అధ్యక్షులు గరికిన్ రవి,ఎమ్మెల్యే ప్రతినిధి ముద్దాడ భాను తదితరులు పాల్గొన్నారు.


Similar News