Ap News: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తాటిపూడి రిజర్వాయర్

విజయనగరం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి...

Update: 2024-09-08 13:07 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం సాయంత్రం వరకూ తీరం దాటే అవకాశం ఉందని, అప్పటి వరకూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే ఎగువన కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఇంకా పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే బుడమేరు వాగు బీభత్సం సృష్టించింది. దీంతో విజయవాడతో పాటు కొల్లేరు లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి.

తాజాగా విజయనగరం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో జిల్లాలోని గంట్యాడ మండలం గోస్తనీ నదిపై తాటిపూడి వద్ద నిర్మించిన రిజర్వాయర్ నీటిమట్టం గరిష్టానికి చేరింది. మొత్తం 297 అడుగులకు వరద నీరు చేరింది. ఇంకా వరద ప్రవాహం పెరిగితే ప్రమాదకర స్థాయికి చేరుతుందని పరివాహక ప్రాంత ప్రజలు అందోళన చెందుతున్నారు. వరద నీరు బీభత్సం సృష్టిస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరోవైపు గుర్ల మండలం జమ్ముపేట అండర్ బ్రిడ్జి దగ్గర ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. దీంతో అతికష్టం మీద బస్సు దిగి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. 


Similar News