Srikakulam: చంద్రబాబుపై ధర్మాన కృష్ణదాస్ ఘాటు వ్యాఖ్యలు

అధికారం, పదవికోసం ఎంతటి నీచానికైనా దిగజారే పాపాత్ముడు చంద్రబాబు అని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు...

Update: 2023-06-14 10:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం కోసం, పదవికోసం ఎంతటి నీచానికైనా దిగజారే పాపాత్ముడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం వనవిష్ణుపురంలో బుధవారం జరిగిన బహిరంగసభలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ తండ్రి సింహం అని కొనియాడారు. అయితే చంద్రబాబు తండ్రి ఎవరో మీకు తెలుసా? నాకే తెలియదు..మీకు ఏం తెలుస్తుందని అని అన్నారు. అబద్దాలకోరు చంద్రబాబుని ప్రజలు నమ్మలేదని, కాబట్టే గత ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితం చేసి పదవినుంచి దింపేశారని విమర్శించారు.

వైఎస్ జగన్ పట్ల ఉన్న విశ్వసనీయత వల్లే 151 స్థానాల్లో వైసీపీని ప్రజలు గెలిపించారని జోస్యం చెప్పారు. ఇలాంటి సమర్ధతగల జగన్‌కూ, అడ్డదారిలో సీఎం అయిన చంద్రబాబుకూ పోలికే లేదని విమర్శించారు. సీఎం పదవికోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌నే కుర్చీ నుంచి కిందకు లాగేసిన చంద్రబాబు ఎలాంటి కుయుక్తిపరుడో ప్రజలందరికీ తెలుసనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయతకు ఐకాన్‌గా సీఎం జగన్ నిలిస్తే, వెన్నుపోటుకు బ్రాండ్ అంబసిడర్‌గా చంద్రబాబు మిగిలిపోయారని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి విద్య, వైద్యం, వ్యవసాయం..ఇలా అన్ని రంగాల్లో సంక్షేమాన్ని తీసుకొచ్చిన జగన్ ప్రతి ఒక్కరికీ ఆత్మీయుడిగా మారారని కొనియాడారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో అబద్దాలు, కుట్రలు, కుతంత్రాలతో మోసం చేయడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల మేలుకోసం చేసింది ఏమీ లేదని ధర్మాన ఎద్దేవా చేశారు. 

Tags:    

Similar News