పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. తండ్రీకూతుళ్లు ఒకేసారి టెన్త్ పాస్
రాష్రం(Andhra Pradesh)లో నిన్న(బుధవారం) పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

దిశ,వెబ్డెస్క్: రాష్రం(Andhra Pradesh)లో నిన్న(బుధవారం) పదో తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలు అధిక ఉత్తీర్ణత సాధించారు. అయితే.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలతో పాటు ఓపెన్ టెన్త్ ఫలితాలు కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విడుదల చేశారు. ఈ ఏడాది విడుదలైన ఈ ఫలితాల్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన షబ్బీర్ 1995-1996లో పదో తరగతిలో ఫెయిలయ్యారు. షబ్బీర్ ప్రమాదవశాత్తు దివ్యాంగుడిగా మారారు. తన తండ్రి ఆర్టీసీ(RTC)లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోవడంతో పదో తరగతి పాసయితే తనకు ఏదో ఒక ఉద్యోగం వస్తుందని షబ్బీర్ భావించారు.
ఈ క్రమంలో నిరాశ చెందకుండా మళ్లీ ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు. ఈ తరుణంలో ఇటీవల ఓపెన్ స్కూల్ పరీక్షలు రాశారు. ఆయన కూతురు కూడా ఇటీవల పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసింది. ఇక నిన్న వెలువడిన ఫలితాల్లో ఇద్దరు పాసై సంచలనం సృష్టించారు. షబ్బీర్ 319, ఆయన కూతురు 309 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇదిలా ఉండగా.. అన్నమయ్య జిల్లా ఆవుల శెట్టివారిపల్లెకు చెందిన మోడెం వెంకటేష్ 9వ తరగతి వరకు చదివి ఆపేశారు. కానీ.. అతనికి చదువు మీద ఆసక్తి తగ్గలేదు. దీంతో మళ్లీ ఇప్పుడు పదో తరగతి చదివి పరీక్షలు రాయగా 268 మార్కులు వచ్చాయి. ఆయన కూతురు పూజిత 585 మార్కులు సాధించింది.
